సంగారెడ్డి అర్బన్, మే 17 : వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మామిడి సాగు, దిగుబడి పెరిగే విధంగా ప్రయోగాలు చేస్తామని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నీరజ అన్నారు. మామిడి సాగులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 9వ స్థానంలో ఉందన్నారు. మంగళవారం సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం (ఎఫ్ఆర్ఎస్)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ప్రపంచ దేశాలకు 40శాతం మామిడి పండ్లు భారతదేశం నుంచే ఎగుమతి అవుతుందన్నారు. మామిడి ఉత్పత్తి శక్తిని పెంచుకుంటే అధిక లాభాలు వస్తాయని, మామిడి రైతు వివిధ దేశాలకు పండ్లను ఎగుమతి చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2లక్షల 51వేల ఎకరాల్లో మామిడి సాగు ఉందని, ఎకరాకు 3-4 టన్నుల కాయలు కాస్తాయన్నారు.
వాతావరణంలో వచ్చే మార్పులతో సాగు విస్తీర్ణం ఘననీయంగా తగ్గిందని, మార్పులను ఎదుర్కొని దిగుబడి పెంచే విధంగా శాస్త్రవేత్తల పరిశోధనలు జరుగుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఫలాలను కేవలం 2శాతం వరకే తీసుకుంటున్నారని, ఈ శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
నాణ్యత పండ్లను ఉత్పత్తి చేయడంలో రైతులు వెనకబడి ఉన్నారని, ప్రస్తుతం ఉన్న టెక్నాలాజిని ఉపయోగించుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ సెంటర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం డైరెక్టర్ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎ.కిరణ్కుమార్, డాక్టర్ ఎ.భగవాన్, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి సునీత, ఎఫ్ఆర్ఎస్ శాస్త్రవేత్త రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.