హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రయాణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని.. విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చే విషయంలో వేగంగా స్పందించాలని కేంద్ర విదేశాంగ మంత్రికి శుక్రవారం మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘జైశంకర్జీ.. ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోండి. వారిని స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. విద్యార్థుల పూర్తి ప్రయాణ ఖర్చులను భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. వాళ్లని సురక్షితంగా, త్వరగా ఇంటికి తీసుకురావాలి’ అంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు ‘కేసీఆర్ సర్.. దయచేసి మమ్ములను ఇంటికి తీసుకెళ్లండి’ అని సుప్రియారెడ్డి అనే విద్యార్థిని చేసిన ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘మీ అందరినీ వీలైనంత త్వరగా తిరిగి తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తున్నాం. కేంద్ర మంత్రి జైశంకర్జీ, కీవ్లోని భారత రాయబార కార్యాలయ అధికారుల బృందంతో కలిసి పనిచేస్తున్నారు. మీ స్థానిక సంప్రదింపు సమాచారాన్ని so-nri@telangana.gov.in లేదా rctelangana@gmail.comకు పంపించండి. మేము రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటాం’ అని రీట్వీట్ చేశారు. తెలంగాణకు చెందిన పలువురు విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు, స్నేహితులు మంత్రి కేటీఆర్కు ట్వీట్లు చేయగా, ఆయన భారతీయ, ఉక్రెయిన్ అధికారులను సాయం చేయాలని కోరుతూ ట్వీట్లు చేశారు.
ఉక్రెయిన్లోని తెలంగాణ విద్యార్థులను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. హైదరాబాద్ సచివాలయంలో, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ల ద్వారా అధికారులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో నిత్యం మాట్లాడుతున్నారు. సరిహద్దులోని పోలండ్, హంగరి, స్లోవెక్ రిపబ్లిక్, రుమేనియా దేశాల అనుమతితో ఇండియాకు రప్పించేలా చూడాలని విద్యార్థులు వేడుకొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24/7 కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం వరకు 300 వరకు కాల్స్ వచ్చినట్టు వివరించారు.
ఉక్రెయిన్లో చికుకున్న తెలంగాణ విద్యార్థుల, ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలకు సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెల్ప్ లైన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఢిల్లీలోని తెలంగాణ భవన్
హెల్ప్ లైన్ నంబర్లు: 7042566955, 9949351270, 9645663661లో సంప్రదించాలని సూచించారు.
ఉక్రెయిన్లో చికుకుపోయిన తెలంగాణ విద్యార్థులు, ప్రవాసుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, ఎవరూ ఆందోళన చెందవద్దని సీఎస్ సోమేశ్కుమార్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదలచేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీలోని తెలంగాణభవన్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని వివరించారు. కాల్ చేసిన వారి వివరాలు నోట్ చేసుకొని, భరోసా కల్పించామని తెలిపారు. 90% తెలంగాణ విద్యార్థులు చదువుతున్న జపోర్జియా మెడికల్ వర్సిటీకి సంబంధించిన భారత ప్రతినిధితో మాట్లాడామని, ఉక్రెయిన్లోని ఇతర రాష్ట్రాల విద్యార్థుల కోఆర్డినేటర్లతో సమన్వయం చేసుకొంటున్నామని వివరించారు.