ఐటీ, ఐటీఈఎస్ (ఇన్ఫరేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ సర్వీసెస్) కంపెనీలకు నిలయమైన నగరంలో ఉపాధి అవకాశాలకు కొదవేం లేదు. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమంది ఉపాధి పొందుతున్నారు. అయితే కంపెనీలన్నీ పశ్చిమ ప్రాంతంలో కేంద్రీకృతం కావడంతో ఆ ప్రాంతంపై
తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. మౌలిక వసతులు, ప్రజల సాధారణ జీవనంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే ప్రభుత్వం గ్రేటర్కు నలువైపులా కంపెనీలను విస్తరించాలని, అభివృద్ధిని వికేంద్రీకరించాలని ఏడాది కిందట గ్రిడ్ పాలసీని తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల అప్పట్లో అమలు సాధ్యం కాలేదు. ప్రస్తుతం జనజీవనం పట్టాలెక్కడంతో గ్రిడ్ పాలసీ అమలును పకడ్బందీగా, వేగవంతంగా అమలు చేసేందుకు పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఐదు సూత్రాలు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి ప్రభుత్వపరంగా పలు ప్రోత్సాహకాలు కల్పిస్తే గ్రిడ్ పాలసీ వేగంగా అమలవుతుందనే
అభిప్రాయాన్ని వ్యక్తం చేయనున్నట్లు తెలిసింది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): నలువైపులా అభివృద్ధికి అనుకూలత హైదరాబాద్ ప్రత్యేకత. అయినా కొన్ని రంగాలు ఒకవైపు మాత్రమే విస్తరిస్తుండటం ఆయా ప్రాంత మౌలిక వసతులు, ప్రజల సాధారణ జీవనంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం నగరం నలువైపులా అభివృద్ధి విస్తరించేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఐటీ, ఐటీఈఎస్ వంటి సంస్థలు నలువైపులా విస్తరించేలా గ్రిడ్ పాలసీని తెచ్చాయి. కాకపోతే కొవిడ్ దరిమిలా ఈ పాలసీ అమలు ఆశించిన స్థాయిలో ముందుకుసాగలేదు. ఈ నేపథ్యంలో తాజాగా గ్రిడ్ పాలసీని వేగంగా అమలు చేసేందుకు నిర్మాణ సంస్థలు ఐదు సూత్రాలను సూచిస్తున్నాయి. అంతేకాదు… మంత్రి కేటీఆర్ను కలిసి పాలసీ అమలులో తమ సూచనలను పరిశీలించాల్సిందిగా కోరనున్నట్లు తెలిసింది.
జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు ఐటీ-ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐటీఈఎస్)లోని బీపీవోలు, హెల్త్, ఫైనాన్స్, బ్యాంకింగ్ తదితర రంగాలకు చెందిన కాల్ సెంటర్లు నగరం నలుమూలలా విస్తరించడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆది నుంచి ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే నగరం నలువైపులా మౌలిక వసతుల కల్పనను పెద్ద ఎత్తున చేపడుతున్నది. అయితే ప్రధానంగా ఐటీ, ఐటీఈఎస్ రంగాలకు చెందిన పరిశ్రమలు గ్రేటర్ హైదరాబాద్ పశ్చిమం వైపునే ఎక్కువగా విస్తరిస్తున్నాయనేది సత్యం. అయితే ఇలాకాకుండా ఈ సంస్థలు ఇతర దిశలో కూడా విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఏడాది కిందటనే గ్రిడ్ పాలసీని తెచ్చింది. అయితే గత ఏడాది డిసెంబరు పదిన ఈ మేరకు జీవోను జారీ చేసింది. ఇందులో ప్రధానంగా నగరం శివారులో ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న పదకొండు పారిశ్రామిక పార్కులను ఐటీ, ఐటీఈఎస్ సంస్థల ఏర్పాటుకు అనుకూలంగా ఉండేలా వసతులు కల్పించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు భూ వినియోగ మార్పిడికి.. అంటే కేవలం పరిశ్రమల ఏర్పాటుకు మాత్రమే నిర్దేశించిన ఆ ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య, ఐటీ, నివాస తదితర అవసరాలకు కూడా భూమిని వినియోగించేలా
(బహుళ వినియోగం) అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో పాటు ఆయా పారిశ్రామిక పార్కుల్లోని కాలుష్య కారక పరిశ్రమలు ఓఆర్ఆర్ తరలించేందుకు కూడా చర్యలు చేపట్టింది. మొదటి దశలో ఉప్పల్, పోచారం, నాచారంలోని ఐదు పారిశ్రామిక పార్కులను ఎంచుకుంది. అయితే ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కొవిడ్ దరిమిలా నెలకొన్న పరిస్థితులు, కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించడం లాంటి పరిణామాలతో పాలసీ అమలు అనేది ఆశించిన స్థాయిలో జరగలేదు. కొద్దిమంది మాత్రమే భూ వినియోగ మార్పునకు దరఖాస్తు చేసుకున్నారు.
ప్రస్తుతం కొవిడ్ ప్రతికూల పరిస్థితుల నుంచి సాధారణ పరిస్థితుల్లోకి అన్ని రంగాలు వెళ్తున్న తరుణంలో గ్రిడ్ పాలసీ విజయవంతంగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని నిర్మాణ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలసీని పకడ్బందీగా, విజయవంతంగా అమలు చేసేందుకు సంస్థల ప్రతినిధులు అందరూ ఐదు రకాల సూచనలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బహుశా రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి ప్రభుత్వపరంగా పలు ప్రోత్సాహకాలు కల్పిస్తే గ్రిడ్ పాలసీ వేగంగా, విజయవంతంగా అమలవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయనున్నట్లు తెలిసింది.