‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు’. ఈ ఫేమస్ సినిమా డైలాగ్ భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కు అతికినట్లు సరిపోతుంది. తాను బరిలోకి దిగనంతే వరకే.. ఒక్కసారి బౌట్లో అడుగుపెడితే ప్రత్యర్థికి హడలే అన్న రీతిలో చెలరేగుతుంది. పదునైన పంచ్లతో విరుచుకుపడే ఈ ఇందూరు బాక్సర్ మరోమారు సత్తాచాటింది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ పేరుకు సార్థకత చేకూరుస్తూ బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో పసిడి వెలుగులు విరజిమ్మింది. తన పంచ్ పవర్కు తిరుగులేదని ఘనంగా చాటిచెబుతూ బ్రిటిష్ గడ్డపై మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాల పంట పండిస్తున్న నిఖత్..పారిస్(2024) ఒలింపిక్స్లో పసిడి లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. కామన్వెల్త్లో స్వర్ణంతో కొత్త చరిత్ర లిఖించిన నిఖత్తో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ.
కామన్వెల్త్లో స్వర్ణంపై మీ స్పందన?
ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్లో స్వర్ణ పతకం సాధించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. బరిలోకి దిగిన తొలిసారే పసిడిని ముద్దాడటం మరిచిపోలేని అనుభూతి. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్గా భారీ అంచనాలు ఉన్నా..ఏ మాత్రం ఒత్తిడికి లోనవకుండా కామన్వెల్త్లో ముందుకు సాగాను. ప్రపంచ బాక్సింగ్ టోర్నీతో పోల్చుకుంటే..కామన్వెల్త్లో పోటీ తక్కువైనా ఎవరిని తక్కువ అంచనా వేయకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధించాను. తొలి బౌట్ నుంచి మొదలుపెడితే ఫైనల్ పోరు వరకు విశ్రమించకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను.
పసిడి పతకాన్ని అమ్మకు అంకితం ఇవ్వడంపై?
కామన్వెల్త్ టోర్నీకి ముందే మా అమ్మకు మాట ఇచ్చాను. కచ్చితంగా స్వర్ణంతో భారత్కు తిరిగివస్తానని. అందుకు తగ్గట్లు కామన్వెల్త్కు ముందు ఐర్లాండ్లో సన్నాహక శిబిరంలో చాలా కష్టపడ్డాను. అందుకు తగ్గ ప్రతిఫలం నాకు దొరికింది. ప్రత్యర్థి ఎవరైనా తక్కువ అంచనా వేయకుండా గెలుపే లక్ష్యంగా దూసుకెళ్లాను. అన్న మాట ప్రకారమే అమ్మకు పసిడి పతకాన్ని కానుకగా ఇచ్చాను. జీవితంలో ఇదొక మరిచిపోలేని అనుభూతి.
ప్రభుత్వ ప్రోత్సాహంపై మీ స్పందన?
ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించడంలో ప్రభుత్వం చాలా ముందుంది. కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో నార్తర్న్ ఐర్లాండ్ బాక్సర్పై మ్యాచ్ గెలువగానే సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. మెగాటోర్నీలో దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసినందుకు శభాష్ అంటూ ప్రశంసించారు. ఇందుకు తోడు క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి బర్మింగ్హామ్లో బౌట్లకు హాజరై మద్దతుగా నిలిచారు. ప్రపంచ చాంపియన్షిప్లో టైటిల్ గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్..రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం సందర్భంగా రెండు కోట్ల నజరానాతో పాటు నివాసస్థలం, డీఎస్పీ ఉద్యోగం ఇచ్చారు. ఏ ప్లేయర్కైనా ఇంతకుమించి ఏం కావాలి. భవిష్యత్లోనూ రాష్ట్ర ప్రజలు గర్వపడేలా రాణిస్తానన్న నమ్మకం నాకుంది. అందుకోసం ఎంతైనా కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నాను.
భవిష్యత్ లక్ష్యమేంటి?
పారిస్ వేదికగా 2024లో జరిగే ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో పసిడి పతకం సాధించడమే నా లక్ష్యం. ఇప్పటికే ప్రపంచ చాంపియన్షిప్, కామన్వెల్త్ గేమ్స్లో విజేతగా నిలిచిన నేను..పారిస్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. ఇందుకోసం ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికను ఎంచుకున్నాను. కరోనా వైరస్ కారణంగా వాయిదాపడి వచ్చే ఏడాది జరుగనున్న ఆసియా గేమ్స్లో సత్తాచాటాలన్న పట్టుదలతో ఉన్నాను. కామన్వెల్త్తో పోల్చుకుంటే ఆసియా గేమ్స్లో తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశముంది. దీనికి తోడు వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఒలింపిక్స్ అర్హత టోర్నీలు జరుగనున్నాయి. అందుకోసం ప్రతీ టోర్నీలో టైటిల్ సాధించాలన్న కసితో ఉన్నాను. ఫిట్నెస్ను కాపాడుకోవడంపై కూడా ప్రధానంగా దృష్టి సారించాను.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహం?
నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. ముఖ్యంగా నా తండ్రి జమీల్ అహ్మద్ వెన్నంటి నిలిచారు. నాన్న ఇచ్చిన మద్దతుతో అద్భుత విజయాలు సొంతం చేసుకుంటున్నాను. నా కెరీర్ కోసం అతను పడ్డ కష్టాలు ఎప్పటికీ గుర్తుంటాయి. కరోనా వైరస్ విజృంభణ సమయంలో ఫిట్నెస్ కాపాడుకునేందుకు మా అక్క నాకు చాలా అండగా నిలిచింది. ఇలా కుటుంబంలో ప్రతీ ఒక్కరు మద్దతుగా నిలువడం వల్లే నేను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాను. కష్టపడితే అనుకున్న లక్ష్యాలను చేరుకోగల్గుతాం. విజయానికి దగ్గర దారులు లేవు. కెరీర్ ఆరంభంలో మహమ్మద్ అలీ, మేరీకోమ్ను స్ఫూర్తిగా తీసుకున్నాను. అందుకు అనుగుణంగా ముందుకెళుతున్నాను.