ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండివాగు గ్రామ సమీపంలో గల గాయత్రి జలపాతం వద్ద శనివారం వాటర్ రాపెల్లింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. మొదటి రోజు సుమారు 30 మంది క్రీడాకారులు జల విన్యాసాలను ప్రదర్శించారు. సాహసికులు తమ జల విన్యాసాలతో కట్టిపడేశారు. పోటీలను వీక్షించేందుకు వచ్చిన చూపరులకు వారు కనువిందు చేశారు. జల విన్యాసాల్లో పాల్గొన్న వారికి తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ డైరెక్టర్ రంగారావు సలహాలు, సూచనలు అందించారు. పోటీలను తిలకించేందుకు పలు గ్రామాల నుంచి యువతి, యువకులు, వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.