ఈడబ్ల్యూఎస్ కోటా నిబంధనలు ఈ ఏడాది కూడా కొనసాగిస్తాం
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ: నీట్ పీజీ ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు కల్పించడానికి వార్షిక ఆదాయ పరిమితిగా రూ.8 లక్షలను నిర్ధారించామని, ఇందులో ఎలాంటి మార్పుల్లేవని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ‘ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్ల నిబంధనలు ఈ ఏడాది కొనసాగుతాయి. వచ్చే ఏడాది మార్పు చేస్తాం’ అని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సు ల్లో ఆలిండియా కోటా సీట్ల విభాగంలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం, ఇతర వెనుకబడిన తరగతుల కోటా కింద 27 శాతం రిజర్వేషన్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని గతంలో ఆదేశించింది. దీంతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం.. దాని నివేదిక ఆధారంగా.. ఈడబ్ల్యూఎస్ కోటా కింద లబ్ధి పొందాలనుకుంటున్న విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించరాదని నిర్ణయించింది.