హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, కాలుష్యం కారణంగా వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు..ఇతర ఇంధన బండ్లకంటే ధర ఎక్కువైనప్పటికీ, తక్కువ రీచార్జ్ వ్యయంతో ఎక్కువ మైలేజీ ఇస్తుండటంతో వీటి అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి.
అదీకాక రిజిస్ట్రేషన్, ట్యాక్స్ తదితర అంశాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు అందిస్తుండడం కూడా ఈవీల విక్రయాలు పెరగడానికి ఎంతో దోహదం చేస్తున్నది. గత ఐదేండ్లలో వీటి విక్రయాలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం భారీగా పెరిగాయి. 2021 సంవత్సరంలో ఈవీల అమ్మకాలు దేశంలో రెండింతలకు పైగా పెరిగిపోవడం విశేషం. ఈ ఏడాది సైతం ఫిబ్రవరి నాటికి సైతం ఈవీల జోరు కొనసాగుతూనే ఉన్నంది.
ఈవీల టూ వీలర్స్ అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం టాప్ టెన్ జాబితాలో స్థానం దక్కించుకుంది. వాస్తవంగా మొత్తంగా ఈవీ మార్కెట్ షేర్లో యూపీ వాటా 20శాతంగా నమోదయినా ఆ రాష్ట్రంలో అత్యధికంగా ఈవీ త్రీవీలర్ల అమ్మకాల ఫలితమే. ఆ రాష్ట్రం లో 59,705 యూనిట్ల త్రీవీలర్లను విక్రయించగా, టూ వీలర్ల అమ్మకాలు 6,286 యూనిట్లు మాత్రమే. ఢిల్లీ, బీహార్ రాష్ర్టాల విక్రయాల్లోనూ అత్యధిక వాటా త్రీవీలర్లదే. కేవలం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతో తెలంగాణ రాష్ర్టాల్లోనే టూ వీలర్ల విక్రయాలు అత్యధికంగా నమోదయ్యాయి.