మహబూబ్నగర్, డిసెంబర్ 26: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. సోమవారం కొవిడ్ ప్రొటోకాల్, బూస్టర్ డోస్, కంటివెలుగు కార్యక్రమంతోపాటు పలు అంశాలపై ప్రత్యేకంగా వైద్యాధికారులతో సమావేశమై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలు దేశాలతోపాటు మన దేశంలోనూ కరోనా కేసులు నమోదవుతున్న సందర్భంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయని తెలిపారు. జిల్లాలోని వైద్యాధికారులు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను అప్రమత్తంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా దవాఖానల్లో మౌలిక వసతులు, మందులు, బెడ్లు, సదుపాయాలు, ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ సమాచారం తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ అంశాలకు సంబంధించి వెంటనే వివరాలను సేకరించి నివేధించాలని తెలిపారు. గతంలో మాదిరిగానే కొవిడ్ను నివారించడంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్, కంటి వెలుగు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్సీ, జనరల్ దవాఖానల్లోని డాక్టర్లు, వైద్యసిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
జనవరి 18నుంచి కంటివెలుగు
జనవరి 18వ తేదీ నుంచి రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు అన్నారు. ఈ మేరకు అధికారులు పూర్తిస్థాయిలో పక్కాగా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు సాగాలని సూచించారు. గతంలో పనిచేసిన అనుభవం అందరికీ ఉన్నందున ఈ విడుతలో ఎలాంటి తప్పులు లేని డాటా ఎంట్రీ తయారు చేయాలని, ఏఎన్ఎం, ఆశ ఇతరులకు ముందుగానే శిక్షణ ఇవ్వాలన్నారు. కంటివెలుగు, కొవిడ్పై గతంలో కంటే మరింతగా పనిచేయాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ శశికాంత్, డీఐవో శంకర్ తదితరులు పాల్గొన్నారు.