అందోల్, నవంబర్ 9: ఈటల రాజేందర్కు చెందిన జమున హేచరీస్ భూముల్లో అధికారులు సర్వే చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు వ్యాఖ్యలు అర్థరహితమని సంగారెడ్డి జిల్లా అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. అందోల్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హేచరీస్ ఏర్పాటుచేసిన ప్రదేశంలో తమ భూములున్నాయని, తమకు ఈటల కుటుంబం అన్యాయం చేసిందని ఆరోపిస్తూ రైతులు ఫిర్యాదు చేయడంతో అధికారులు భూముల సర్వే చేపట్టారని గుర్తుచేశారు.
సర్వేను వ్యతిరేకిస్తూ ఈటల కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆయనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పిందని అన్నారు. భూముల విషయంలో తప్పిదాలు జరుగనప్పుడు సర్వే చేస్తే మీకు వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించిన హైకోర్టు సర్వేకు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని తెలిపారు. కరోనా కారణంగా అప్పుడు సర్వే నిలిపివేశారని చెప్పారు. తిరిగి ఇప్పుడు చేపట్టారని అన్నారు. ఇవన్నీ తమకు తెలియదన్నట్టుగా నటిస్తున్న బీజేపీ నేతలు.. కక్ష సాధింపులంటూ ఆరోపణలు చేయడం తగదని విమర్శించారు.