హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పేదలు, అణగారిన వర్గాల గొంతుకగా ఈశ్వరీబాయి నిలిచారని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. బలహీనవర్గాల పక్షాన, వారి హక్కు ల కోసం పోరాడిన నేతగా ఖ్యాతి గడించారని కొనియాడారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈశ్వరీబాయి 103వ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సభాధ్యక్షత వ్యవహరించారు. ముఖ్యఅతిథులుగా గవర్నర్ తమిళిసై, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డికి ఈశ్వరీబాయి స్మారక అవార్డు-2021 అందజేశారు. అనంతరం మాట్లాడిన గవర్నర్.. లంచగొండితనం, అవినీతి పట్ల సింహస్వప్నమై పోరాడిన ఈశ్వరీబాయి ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు.
1969 మొదటి దశ తెలంగాణ ఉద్యమకారిణిగా పోరాడిన నేత ఈశ్వరీబాయి అని, ఆమె తెలంగాణ అస్తిత్వ పతాకగా నిలిచారని మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. చదువుతోనే సమాజంలో అంతరాలు తొలుగుతాయని మరో సావిత్రిబాయి పూలేలా అక్షరజ్ఞానాన్ని పంచిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. మున్ముందు ఈశ్వరీబాయి జీవితంపై నాటకాన్ని అధికారికంగా ప్రదర్శించేలా కృషిచేస్తామని వెల్లడించారు.
ఈశ్వరీబాయి గొప్ప మానవతావాది అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేసిన మాజీ మంత్రి, ఈశ్వరీబాయి కూతురు గీతారెడ్డి.. మహిళా సమాజానికి ఈశ్వరీబాయి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. అవార్డు దక్కటం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. వేరే వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్ 6 రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుందని, మరో మూడు నెలలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర భాష, సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, వ్యాఖ్యాత దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు.