హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): చెత్త నుంచి విద్యుత్తు తయారీకి రాంకీ సంస్థ అనుసరిస్తున్న విధానం బాగున్నదని విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ప్రశంసించింది. చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి భవిష్యత్తులోనూ స్పూర్తిని కలిగించే అంశమని పేర్కొంది. గురువారం ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగరావు బృందం హైదరాబాద్లో రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ సైట్ను సందర్శించింది. రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ సీఈవో, ఎండీ గౌతమ్రెడ్డి ప్లాంట్ పనితీరును, వినియోగిస్తున్న టెక్నాలజీ గురించి వివరించారు.