దేశంలో వేతన జీవుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డటయింది. అసలే కరోనాతో ఆదాయం దెబ్బతిన్న ఉద్యోగులు, కార్మికుల పొదుపు ఆశల్ని మోదీ సర్కారు ఆవిరి చేసింది. ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీరేటును ఏకంగా నాలుగు దశాబ్దాల కనిష్ఠానికి దిగజార్చుతూ 8.1 శాతానికి ఈపీఎఫ్వో సెంట్రల్బోర్డు ట్రస్టీలు నిర్ణయించారు. 1977-78లో పీఎఫ్పై వడ్డీరేటు 8 శాతంగా ఉండేది. మళ్లీ ఆ దరిదాపుల్లోకి వడ్డీరేటు ఇప్పుడే రావడం గమనార్హం. ఈ చర్యతో దేశవ్యాప్తంగా ఆరు కోట్లమంది ఉద్యోగుల సంపదను కేంద్రం దోచుకున్నట్టేనని ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపక్షాలదాకా విమర్శిస్తున్నాయి.
న్యూఢిల్లీ, మార్చి 12: కోట్లాదిమంది ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు నాలుగు దశాబ్దాల కనిష్ఠస్థాయి 8.1 శాతానికి తగ్గించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీ చెల్లించాలని కార్మిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) సెంట్రల్ ట్రస్టీల బోర్డు (సీబీటీ) సిఫార్సుచేసింది. ట్రేడ్ యూనియన్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా, గువాహటిలో కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన శనివారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్పై 1977-78 తర్వాత ఇదే కనిష్ఠ వడ్డీ రేటు. అప్పట్లో ఈ రేటు 8 శాతంకాగా, అటుతర్వాత 8.25 శాతంపైనే కొనసాగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇది 8.5 శాతంగా ఉంది. పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవనం కోసం నిలకడైన పొదుపుసాధనంగా పరిగణించే పీఎఫ్ డిపాజిట్పై రేటును తగ్గించి 6.5 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారుల్ని కేంద్రం హతాశుల్ని చేసింది. నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ రేటు తగ్గుతూ వచ్చింది. 2015-16లో 8.8 శాతంగా ఉన్న పీఎఫ్ రేటు తాజాగా 8.1 శాతానికి పడిపోయింది.
ప్రభుత్వం, కార్మికులు, కంపెనీల యాజమాన్యాల ప్రతినిధులు ట్రస్టీలుగా ఉండే సీబీటీ నిర్ణయాల్ని ఈపీఎఫ్వో అమలుపరుస్తుంది. వాస్తవానికి ఉద్యోగుల ప్రతినిధులు వడ్డీ రేట్లను పెంచాలని పట్టుపడుతున్నా, బోర్డు మాత్రం తగ్గించాలని సిఫార్సుచేసింది. ఇది కేంద్ర కార్మిక మంత్రి నేతృత్వంలోని సంస్థ అయినప్పటికీ, పెట్టుబడి, వడ్డీ రేట్ల ప్రతిపాదనల్ని కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలించి, ఆమోదించాల్సి ఉంటుంది. తాజాగా వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయానికి ఆర్థిక శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన తర్వాత కొత్త రేటును నోటీఫై చేస్తారు. తదుపరి వడ్డీ ఆదాయాన్ని చందాదారుల ఖాతాల్లో జమచేస్తారు. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లకు సమానంగా పీఎఫ్ రేటును సైతం తగ్గించాలని కార్మిక శాఖపై కొద్దికాలంగా ఆర్థిక శాఖ ఒత్తిడి చేస్తున్నది. ప్రస్తుతం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై గరిష్ఠంగా 7.6 శాతం వడ్డీ రేటు ఉన్నది.
కోట్లాదిమంది మధ్యతరగతి వేతన జీవులపై ఈపీఎఫ్వో తాజా నిర్ణయంతో పెద్ద దెబ్బకొట్టింది. బ్యాంక్ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్లపై రేట్లు తగ్గుతూ వస్తున్న తరుణంలో మధ్య తరగతిలో పీఎఫ్ డిపాజిట్లు ప్రాచుర్యం పొందాయి. ఈపీఎఫ్వో చందాదారులు పీఎఫ్ను పదవీ విరమణ అనంతరం అక్కరకు వచ్చే పొదుపు సాధనంగానే పరిగణిస్తారు. ఈ డిపాజిట్లపై వివిధ అవసరాలకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉన్నా, అధికశాతం మంది అందుకు ఇష్టపడరు. అలాంటి సాధనంలో చందాదారులుగా ఉన్న 6.5 కోట్ల మంది మధ్యతరగతికి రేటు తగ్గింపు
విఘాతమే.
ఈపీఎఫ్వో వడ్డీ రేటు తగ్గింపు కార్మిక పక్షాలపై దాడిచేయడమే. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి, ధరల పెరుగుదలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఈ దాడుల్ని
తిప్పికొట్టాలి.
-సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ప్రభుత్వం నిజస్వరూపం బయటపడింది. రేటు తగ్గింపుతో కార్మికుల్ని బస్సు కిందకు తోసేసింది.
-బినోయ్ విశ్వమ్, సీపీఐ పార్లమెంటు సభ్యుడు
తాజాగా ముగిసిన వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించినందుకు ప్రజలకు బీజేపీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది. ఎన్నికల విజయం ఆధారంగా కోట్లాదిమంది ఉద్యోగుల పొదుపుపై దాడి చేయడం సరైనదేనా? ఎంతో మంది ఆదాయం ఒక్కసారిగా తగ్గిపోయింది.
-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
1952 నుంచి 1955 వరకు 3 శాతంగా ఉన్న ఈపీఎఫ్ వడ్డీరేటు ఆ తర్వాత రెండేండ్లలో 3.5 శాతానికి పెరిగింది. ఇదే క్రమంలో 1955 నుంచి 1963 మధ్యకాలంలో ఇది 3.75 శాతానికి ఎగిసింది. ఆ తర్వాతేడాది 4 శాతం నుంచి 4.50 శాతానికి, 1966-67లో దీనిని 4.75 శాతానికి పెంచింది. వరుసగా పెంచుతూ వచ్చిన ఈపీఎఫ్వో బాడీ..ఆ తర్వాత 1977-78 నాటికి వడ్డీరేటును 8 శాతానికి చేర్చింది. 1979-81లో 8.25 శాతానికి పెరిగిన వడ్డీరేటు..ఆ తర్వాత పదేండ్ల కాలానికి రికార్డు స్థాయి 12 శాతానికి ఎగబాకింది. 1989 నుంచి 2001 వరకు వడ్డీరేటు స్థిరంగా 12 శాతంగా ఉన్నది. అక్కడే అసలు ట్విస్ట్ నమోదైంది. అప్పటి నుంచి తగ్గుతూ వచ్చిన వడ్డీరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను నాలుగు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. జూన్ 2001లో 12 శాతంగా ఉన్న వడ్డీరేటు ఆ మరుసటి నెలలోనే 11 శాతానికి దిగించింది. ఇది వాజ్పేయ్ నేతృత్వంలోని సర్కార్ పీఎఫ్ వడ్డీపై కోత విధించింది. అప్పట్లో బ్యాంకుల వడ్డీరేట్లు, ఇతర వడ్డీరేట్లు భారీగా తగ్గడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నది. ఆ మరుసటి ఏడాది 2001-02లో 9.5 శాతానికి దిగిన పీఎఫ్ వడ్డీరేటు 2004-05 వరకు యథాతథంగానే కొనసాగింది. 2005 నుంచి 2010 నాటికి 8.5 శాతానికి దించాయి అప్పటి కేంద్ర ప్రభుత్వాలు. నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతియేటా ఈపీఎఫ్ వడ్డీరేట్లలో మార్పులు చేస్తున్నది.
2020-21 8.5
2019-20 8.5
2018-19 8.65
2017-18 8.55
2016-17 8.65
2015-16 8.8
2014-15 8.75