శ్రీశైలం : శ్రీగిరులుపై ప్రసాద్ (PRASAD – Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive) పథకంలో భాగంగా చేపడుతున్న నిర్మాణలను దేవస్థానం ఈఓ లవన్న ఆదివారం పరిశీలించారు. అలాగే గోసంరక్షణ శాల, విభూతి తయారీ కేంద్రాన్ని, యాంపీ థియేటర్ పనులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోశాలలో శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎప్పటికప్పుడు గోశాలను శుభ్రం చేసేందుకు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గోవులకు తగినంత మేత, తాగునీరు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. విభూది తయారీ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు.
సంప్రదాయ పద్ధతుల్లో పూర్తి నాణ్యతతో విభూది తయారు చేయాలని ఆదేశించారు. భక్తుల సంఖ్యను అనుగుణంగా విభూదిని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ (PRASAD) పథకంలో భాగంగా నిర్మిస్తున్న యాంపీ థియేటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటికే 90శాతం పనులు పూర్తి కాగా.. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. యాంపీ థియేటర్ కళాత్మకంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు.
పథకంలో భాగంగా లైట్ అండ్ సౌండ్ షో, ఆలయంలో ఇత్తడి క్యూలైన్ల ఏర్పాట్లు, బస్టాండ్ సమీపంలో విశాలమైన పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు, వలయ రహదారి వద్ద పార్కింగ్ ప్రదేశ్ ఏర్పాటు, క్షేత్రంలో పలుచోట్ల శౌచాలయాల నిర్మాణం, కర్ణాటక ప్రభుత్వ అతిథిగృహం వద్ద టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ నిర్మాణం, శిఖరం వద్ద టూరిస్ట్ మినిటీస్ సెంటర్ నిర్మాణం, శిఖరేశ్వరం వద్ద వాచ్ ఎవర్ నిర్మాణం, శిఖరేశ్వర ఆలయం వద్దగల పురాతన పుష్కరిణి జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు.