యాదాద్రి, మార్చి 25 : యాదాద్రిలో కూడా తిరుమలలో మాదిరిగా బ్రేక్ దర్శనాలు, ఆన్లైన్ దర్శనాలు అమలు చేస్తామని ఆలయ ఈవో గీత తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 28న ఉదయం 11.55 గంటలకు యాదాద్రి ప్రధాన ఆలయాన్ని పునఃప్రారంభిస్తారని చెప్పారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తులకు స్వయంభువుల దర్శనం కల్పిస్తామని చెప్పారు. యాదాద్రి కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించబోమని స్పష్టంచేశారు. కొండ కింద యాగశాల ప్రాంగణంలోని పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలిపి, దేవాలయం తరఫున నడిపే బస్సుల్లో కొండపైకి వచ్చి దర్శనం చేసుకోవాలని సూచించారు. ప్రతి భక్తుడికీ క్యూఆర్ కోడ్ను ఇస్తామని, రద్దీకి అనుగుణంగా దేవాలయ బస్సులను నడుపుతామని తెలిపారు. భక్తులు క్యూ కాంప్లెక్స్ నుంచే స్వామివారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.
ఏర్పాట్లపై ప్రభుత్వ విప్ సమీక్ష
ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా యాదాద్రిలో చేపట్టిన ఏర్పాట్లపై ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సమీక్షించారు. పార్కింగ్, నీటి వసతి, విద్యుత్తు సరఫరా, వీవీఐపీ విడిది నిమిత్తం కేటాయించిన గదులు తదితర అంశాలపై శుక్రవారం యాదాద్రి వీవీఐపీ అతిథి గృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా కొండపైకి ముఖ్యమంత్రి వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపారు. ప్రెసిడెన్షియల్ సూట్లో ముఖ్యమంత్రి కేసీఆర్, విల్లాల్లో మంత్రులు, మున్నూరు కాపు సత్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వసతి కల్పించనున్నారు. సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి, ఆర్డీవో భూపాల్రెడ్డి, వైటీడీఏ ఎస్ఈ వసంతనాయక్, ఈఈ వెంకటేశ్వర్రెడ్డి, విద్యుత్తు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.