న్యూఢిల్లీ : సరిహద్దు రక్షణ దళం (BSF) అధికార పరిధిని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్తో పాటు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తీర్మానాలను ఆమోదించారు. తీర్మానంపై చర్చ సందర్భంగా బెంగాల్కు చెందిన టీఎంసీ ఎమ్మెల్యేలు బీఎస్ఎఫ్ మహిళలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో బుధవారం బీఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వై ఖురానియా స్పందించారు. మహిళలను శోధించే హక్కు.. మహిళా సైనికులకు మాత్రమే ఉందన్నారు.
ఈ పరిస్థితుల్లో టీఎంసీ ఎమ్మెల్యే చేసిన ఆరోపనలు పూర్తిగా నిరాధారమైనవి. అంతర్జాతీయ సరిహద్దు భద్రత కోసం బీఎస్ఎఫ్ అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటుందని ఖురానియా పేర్కొన్నారు. అధికార పరిధి విస్తరణ నోటిఫికేషన్ ద్వారా బీఎస్ఎఫ్, పోలీసులకు మధ్య ప్రతిష్టంభన పెరుగుతుందని నిరాధారమైన అభిప్రాయం ఉందని, విస్తరణతో పోలీస్ వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. బీఎస్ఎఫ్కు పోలీసులకు ఉన్న అధికారులైన.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి, దర్యాప్తు చేయడానికి అధికారం లేదన్నారు.
పంజాబ్, పశ్చిమ బెంగాల్, అసోంలోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉన్న అధికార పరిధిని కేంద్రం ఇటీవల 50 కిలోమీటర్లకు పెంచింది. దీంతో సోదాలు, నిర్బంధాలు, అరెస్టులు చేసేందుకు అవసరమైన అధికారం బలగాలకు ఇచ్చేందుకు కేంద్రం బీఎస్ఎఫ్ చట్టాన్ని సవరించింది. అయితే మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో అధికార పరిధిని 20 కిలోమీటర్లకు కుదించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో ఇంతకు ముందు అధికార పరిధి 80 కిలోమీటర్ల వరకు ఉండేది. అలాగే గుజరాత్లోనూ బీఎస్ఎఫ్ అధికార పరిధిని 80 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు తగ్గించింది.