Nowhera Shaik : నౌహిరా షేక్ కేసులో తాజాగా మరో రూ.78కోట్లను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఎస్ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్కు చెందిన రూ.37.58కోట్లను పీఎంఏల్ఏ కింద అటాచ్ చేశారు. అదే విధంగా బెంగళూరు కేంద్రంగా ఉన్న నీలాంచల్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భాగస్వామి సయ్యద్ అక్తర్కు చెందిన రూ.41.05కోట్ల నగదును అటాచ్ చేశారు.
షేక్ నౌహిరా, హీరా గ్రూపు ( Heera Group ) ప్రజల దగ్గరి నుంచి రూ.5వేల కోట్లను సేకరించింది. 36 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తామంటూ తప్పుడు ప్రచారం చేసి ప్రజల నుంచి ఈ మొత్తాన్ని తీసుకుంది. అయితే ప్రజలకు వారు పెట్టిబడి పెట్టిన మొత్తాన్ని కూడా ఇవ్వకపోవడంతో, వారి ఫిర్యాదుల నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేస్తోంది. నౌహిరా షేక్, హీరా గ్రూపులు రూ.148 కోట్లను ఎస్ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్కు బదిలీ చేసినట్లుగా ఈడీ గుర్తించింది. ఈ మొత్తంతో టోలిచౌకి ప్రాంతంలో ఆస్తులను కొనుగోలు చేశారు. అయితే వాటి విలువ కేవలం రూ.70కోట్లు మాత్రమే ఉందని, మిగిలిన రూ.78కోట్లు ఎస్ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వద్ద ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మొత్తంలో రూ.41కోట్లను నీలాంచల్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి, మరో నాలుగు షెల్ కంపెనీలకు బదిలీ చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే రూ.300కోట్లను ఈడీ అటాచ్ చేసింది.