శ్రీరాంపూర్, అక్టోబర్ 22: సింగరేణి కాలరీస్ కంపెనీ మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైంది. విద్యుదుత్పత్తి సంస్థలకు సంబంధించి వివిధ అంశాలపై అధ్యయనం చేస్తూ ప్రోత్సాహక అవార్డులను ప్రకటించే కౌన్సిల్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్స్ (ముంబై) సంస్థ వారు 2021వ సంవత్సరానికి గాను ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డును శుక్రవారం జాతీయ స్థాయిలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రకటించారు. దక్షిణ భారత దేశంలో 500 మెగావాట్లు, ఆపై స్థాయి ఉత్పత్తి సామర్థ్యమున్న సుమారు 100 ప్లాంట్ల విభాగంలో ఈ అత్యుత్తమ అవార్డును ఎస్టీపీపీకి ప్రకటిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. సాధారణంగా 600 మెగావాట్ల సామర్థ్యమున్న ప్లాంట్లు ఒక యూనిట్ను ఉత్పత్తి చేయడానికి 2,444 కిలో కాలరీ శక్తిని (బొగ్గును) వినియోగించవచ్చని ప్రామాణికంగా సూచిస్తుంటారు. కాగా 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉన్న రెండు ప్లాంట్లలో ఒకటో ప్లాంట్ ఒక యూనిట్ విద్యుదుత్పత్తి నిర్దేశిత ప్రమాణాల కన్నా తక్కువగా సగటున 2,425 కిలో కాలరీ శక్తి (బొగ్గును)ని మాత్రమే వినియోగిస్తున్నది. ఇలా అత్యంత సమర్థవంతంగా బొగ్గును వినియోగిస్తున్నందుకు గుర్తింపుగా ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డును ప్రకటిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.