Sensex Gains | ఆర్థిక మాంద్యం భయాలపై యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటనతో ఇన్వెస్టర్లకు రిలీఫ్ లభించింది. దూకుడుగా వడ్డీరేట్లు పెంచినా తీవ్ర `ఆర్థిక మాంద్యం` తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని జెరోమ్ పావెల్ ప్రకటించారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగి రావడంతో రూపాయి మారకం విలువ బలోపేతమై దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఐటీ స్టాక్స్ సారధ్యంలో ఫైనాన్సియల్ రంగ స్క్రిప్ట్లు వృద్ధి చెందాయి. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో లాభాలు ఇంట్రాడేలో తుడిచిపెట్టుకుపోయినా.. చివరి దశలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 105 (0.18 శాతం) పాయింట్ల వృద్ధితో 59,793 పాయింట్ల వద్ద ముగిసింది.
మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 35 పాయింట్లు (0.19 శాతం) లాభ పడి 17,833 పాయింట్ల వద్ద స్థిర పడింది. నిఫ్టీ మిడ్ క్యాప్-100 0.35 శాతం, స్మాల్క్యాప్-100 స్వల్పంగా 0.06 శాతం లాభ పడ్డాయి. టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, మారుతి సుజుకి, ఎస్బీఐ, టీసీఎస్ స్క్రిప్ట్లు లాభపడ్డాయి. కాగా, ఆస్ట్రల్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఆల్ కార్గో లాజిస్టిక్స్, నజారా టెక్నాలజీస్, స్టాఫ్ క్రాఫ్ట్ లబ్ధి పొందాయి. రంగాల వారీగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ రెండు శాతం, నిఫ్టీ ఫైనాన్సియల్, రియాల్టీ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 60,045.75 పాయింట్లతో ట్రేడింగ్ ప్రారంభం కాగా ఇంట్రాడే ట్రేడింగ్లో 60,119.80 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. ఒకానొక దశలో 59,634.39 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయి తిరిగి 104.92 పాయింట్లు లబ్ధి పొంది 59,793.14 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఉదయం 17,923.35 పాయింట్ల వద్ద పాజిటివ్గా ట్రేడింగ్ ప్రారంభించినా అంతర్గత ట్రేడింగ్లో 17,925.95 పాయింట్ల నుంచి 17,786 పాయింట్ల మధ్య కదలాడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 34.60 పాయింట్ల వృద్ధితో 17.833.35 పాయింట్ల వద్ద నిలిచింది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ 79.54 వద్ద స్థిర పడింది.
బీఎస్ఈ-సెన్సెక్స్లో టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, మారుతి, టీసీఎస్, ఎస్బీఐ, విప్రో, యాక్సిస్ బ్యాంక్, హెచ్యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ షేర్లు లబ్ధి పొందాయి. మరోవైపు అల్ట్రా టెక్ సిమెంట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్&టీ, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్ట్లే ఇండియా, సన్ ఫార్మా, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ పతనం అయ్యాయి.