చిక్కడపల్లి, జనవరి 22: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో కళలు, కళాకారులకు ప్రోత్సాహం లభిస్తున్నదని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు 82వ వర్దంతి సందర్భంగా గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్, మేడిది సుబ్బయ్య ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం బాగ్ లింగంపల్లిలోని ఎన్జీవోస్ కార్యాలయంలో గిడుగు స్మారక పురస్కారాలు, భాషా సాహిత్య కళా సేవా రంగా జాతీయ పురస్కరాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరీ శంకర్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యం గురించి బాగా తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు.
ప్రముఖ కవి, సీనియర్ పాత్రికేయుడు బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్జీవోస్ నెట్వర్క్ జాతీయ చైర్మన్, ఆరిగపూడి పూర్ణ చంద్ర రావు ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ లయన్ ఎ.విజయ్ కుమార్, మేడిది సుబ్బయ్య ట్రస్ట్ చైర్మన్ మేడిది వెంకటేశ్వర రావు, రాజా వాసిరెడ్డి ఫాండేషన్ చైర్పర్సన్ రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, ప్రముఖ కవి రచయిత్రి సి.శశిబాల, ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గిడుగు కాంతి కృష్ణ హాజరయ్యారు. ‘గిడుగు’ జాతీయ జీవన సాఫల్య పురస్కారాలను శత చిత్ర నిర్మాత డాక్టర్ తుమ్మల రామ సత్యనారాయణ, కవి, కథా రచయిత వి.డి.రాజగోపాల్, ప్రముఖ నవలా రచయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి, ప్రముఖ కవి, మువ్వ శ్రీనివాస్ రావు, ప్రముఖ సంగీత దర్శకుడు ఘన్శ్యామ్, ప్రముఖ కవి, విమర్శకుడు కాంచనపల్లి గోవర్దనరావు, ప్రముఖ కవి గీత రచయిత సాదనాల వెంకట స్వామి నాయుడులకు ప్రదానం చేశారు.