హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని చేసిన వ్యాఖ్యల పట్ల ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మోదీ పదేపదే వ్యాఖ్యానించడాన్ని జేఏసీ నేతలు ముక్తకంఠంతో ఖండించారు. అవమాకర రీతిలో మాట్లాడారని మండిపడ్డారు. మోదీ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కార్పొరేట్ మోదీ, అహంకారి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ఉద్యోగ జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. గురువారం నుంచి ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి, నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునే వరకు నిరసనలు కొనసాగుతాయని చెప్పారు. మోదీ వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. మోదీ తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని, తెలంగాణ ఏర్పాటు మోదీకి ఇష్టంలేనట్టున్నదని ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ వీ మమత అన్నారు. టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ మాట్లాడుతూ.. చీకట్లో, లైట్లు ఆర్పి తెలంగాణ బిల్లు ఆమోదించారంటున్న మోదీ.. దేశానికి అర్ధరాత్రి సిద్ధించిన స్వాతంత్య్రాన్ని వద్దందామా..? అని ప్రశ్నించారు. సమావేశంలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు రామినేని శ్రీనివాస్రావు, అరుణ్కుమార్, శ్రీరామ్, జీ వెంకటేశ్వర్లు, జ్ఞానేశ్వర్, యూసుఫ్, నోరి శ్రీనేశ్కుమార్, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.