రంగారెడ్డి, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ప్రకృతితో పాటు, సహజ సిద్ధంగా లభించే పూలను దేవతలా కొలిచే వేడుక ‘బతుకమ్మ పండుగ’ అని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. రంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆరో రోజు జిల్లా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో అదనపు కలెక్టర్ తిరుపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొని.. డీఆర్వో హరిప్రియ, ఏవో ప్రమీలతో కలిసి పూజలు నిర్వహించి, వేడుకలను ప్రారంభించారు. అనంతరం, మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకమని, నూతన వస్ర్తాలు ధరించి బతుకమ్మను పేర్చి పూజిస్తారని తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రత్యేకతను సంతరించుకున్నదని పేర్కొన్నారు. మానవాళిని ప్రకృతికి దగ్గర చేసే కార్యక్రమం బతుకమ్మ పండుగ అని అన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ విభాగం సిబ్బంది, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.