twitter| న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ దిగ్గజం ‘ట్విట్టర్’ యజమాని ఎలాన్ మస్క్ మరో బాంబు పేల్చారు. ట్విట్టర్ ‘పక్షి’ లోగోను మార్చనున్నట్టు ఆదివారం వెల్లడించారు. దీంతోపాటు ట్విట్టర్ను రీబ్రాండ్ చేయనున్నట్టు ప్రకటించారు. చైనాకు చెందిన వియ్చాట్ తరహాలో ఎవ్రీథింగ్ ‘ఎక్స్’ యాప్ను రూపొందించాలని ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. కేవలం సామాజిక మాధ్యమంగానే కాకుండా పేమెంట్ సర్వీసెస్, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ వంటి అని రకాల సేవలు అందించేలా ఈ యాప్ను తీర్చిదిద్దనున్నారు. అందులో భాగంగానే ట్విట్టర్ను అతిత్వరలో ఎక్స్ యాప్గా రీబ్రాండ్ చేయనున్నట్టు సమాచారం. ‘త్వరలోనే మేం ట్విట్టర్ బ్రాండ్కు.. తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలుకనున్నాం. ఈ రాత్రి పోస్టు చేసిన ఎక్స్ లోగో బాగుంటే.. రేపటి నుంచి లైవ్లోకి వస్తుంది’ అని మస్క్ ట్వీట్ చేశారు.
గత ఏడాది ట్విట్టర్ను కొనుగోలు చేసుకున్నప్పటి నుంచి ఎలాస్ మస్క్ సంస్థలో అనేక మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ బిజినెస్ నేమ్ను ఎక్స్ కార్ప్గా మార్పు చేశారు. యూజర్లు రోజువారి చూసే ట్వీట్లపై పరిమితి విధించనున్నట్టు ఈ నెల ప్రారంభంలో మస్క్ ప్రకటించిన నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ట్విట్టర్కు పోటీగా మెటా ప్రారంభించిన థ్రెడ్స్ యాప్కు ఆ నిర్ణయం పరోక్షంగా లాభించింది.