న్యూఢిల్లీ : రెండేళ్లలో విద్యుత్ వాహనాల ధరలు.. పెట్రోల్ వాహనాల ధరలతో సమానమవుతాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేలశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విద్యుత్ వాహనాల సంఖ్య తక్కువగా ఉన్నాయని, దీంతో రేట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ వార్షిక సమావేశంలో ముఖ్య అతిథిగా వర్చుల్ విధానంలో పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో ఈవీ వాహనాల ధరలు.. పెట్రోల్ వేరియంట్లతో సమానంగా ఉండే స్థాయికి దిగివస్తాయన్నారు. అలాగే ఈవీ చార్జింగ్ సౌకర్యాలను విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
2023 నాటికి ప్రధాన రహదారులపై 600 ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సౌర, పవన విద్యుత్ ఆధారమైన పాయింట్లు నెలకొల్పాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. భారత్ ఎలక్ట్రానిక్ వాహనాల విప్లవం కోసం ఎదురుచూస్తోందని, 250 స్టార్టప్ కంపెనీలు తక్కువ ఖర్చుతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతపై పని చేస్తున్నాయన్నారు. ప్రధాన వాహన తయారీదారులు వాహనాల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే పనిలో ఉన్నారు. పెట్రోల్తో నడిచే కారు కిలో మీటర్కు రూ.10, డీజిల్ వాహనాలతో రూ.7 ఖర్చు వస్తే.. ఎలక్ట్రానిక్ వాహనం కిలోమీటర్కు కేవలం రూపాయి మాత్రమే ఖర్చవుతుందని వివరించారు.