హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో సభలు పెట్టొద్దంటూ ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు అడ్వైజరీ ఇవ్వడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల సంఘం తన పరిధిని మించి వ్యవహరిస్తున్నదన్నారు. సోమవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఈసీ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి
మొన్న నాగార్జునసాగర్లో నా సభ అడ్డుకోవాలని చూశారు. ఇప్పుడు జరుగుతున్న హుజూరాబాద్ ఎన్నికలో కేసీఆర్ సభ పెట్టకుండా చేయాలని ప్రయత్నంచేశారు. ఇదేం దిక్కుమాలిన రాజకీయం? భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలి. గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్లు తమ పరిధిని దాటుతున్నారు. ఎస్.. ఈ దేశంలో ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా, బాధ్యతగల పార్టీ అధ్యక్షుడిగా ఈ దేశంలో పని చేస్తున్న రాష్ర్టాల సీఎంలలో ఒక సీఎంగా ఎన్నికల సంఘానికి సలహా ఇస్తున్నా. మీరు ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోండి. మీ గౌరవాన్ని తీసుకోకండి.
ఇదా రాజకీయం?
మొన్న నాగార్జునసాగర్లో ఎన్నిక జరిగింది. ఎన్నిక అంటే ఏ పార్టీ అయినా సభలు, సమావేశాలు పెట్టడం, నాయకులు వెళ్లి పనిచేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో మిత్రులు గుత్తా సుఖేందర్రెడ్డి శాసనమండలి చైర్మన్గా ఉన్నారు. ఆయన అక్కడ ఎంపీగా పనిచేశారు. పలుకుబడి ఉన్నది. ఆయనెళ్లి ప్రచారంచేస్తే అక్కడ పార్టీకి కొంత లాభం జరుగుతుంది. కానీ నిబద్ధత ఉన్నవాళ్లం కాబట్టి నేనే వద్దని చెప్పిన. కానీ విచిత్రమైన పరిణామం ఏమిటంటే.. నాగార్జునసాగర్లో కేసీఆర్ సభ పెట్టొద్దని హైకోర్టులో కేసు వేస్తరు. ఇదేం దిక్కుమాలిన వ్యవస్థ! ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావొచ్చు సభ పెట్టుకోవచ్చని చెప్పాలి కానీ.. కేసీఆర్ సభ పెట్టొద్దని హైకోర్టులో కేసు వేశారు. ఇదా రాజకీయం?
హుజూరాబాద్ ప్రజలు లైవ్లో చూస్తున్నరు
హుజూరాబాద్లో కేసీఆర్ సభ పెట్టొద్దు. ఇదేం కథ? ఇది పద్ధతా? ఇప్పుడు ఏమైందీ.. ఇక్కడ నేను మాట్లాడే మాటలు అక్కడ హుజూరాబాద్ ప్రజలు లైవ్లో వింటున్నారు. ‘సార్ ప్లీనరీలో హుజూరాబాద్ గురించి మీరొక్క మాట చెప్పండి.. బహిరంగ సభ పెట్టినదాని కన్నా ఎక్కువ లాభం అయితది’ అని మన నాయకులు అన్నారు. చాలామంది సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్, హరీశ్ కావొచ్చు, గంగుల కమలాకర్ కావొచ్చు, అనేక మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మన మధ్యలేరు. వాళ్లంతా హుజూరాబాద్ పోరాటంలో ఉన్నరు.