షాబాద్, నవంబర్ 25 : బాల కార్మిక, వెట్టిచాకిరి వ్యవస్థలను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మైనర్ పిల్లల కోసం పనిచేసే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కొవిడ్ సమయంలో చాలా బాగా పనిచేశాయన్నారు. ఇకముందు కూడా అన్ని శాఖల వారు సమన్వయంగా పనిచేయాలని చెప్పారు. బాల కార్మిక, వెట్టిచాకిరి వ్యవస్థలను రూపుమాపాలని, చైల్డ్ మ్యారేజ్, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
చిన్న పిల్లల కోసం పనిచేసే అన్ని శాఖలు మంచి కో-ఆర్డినేషన్తో ముందుకు పోవాలని, పిల్లల కోసం ఏమవసరమైనా తాము ముందుంటామని జిల్లా లీగల్ సర్వీస్ సెక్రటరీ శ్రీదేవి తెలిపారు. చిన్న పిల్లల విషయంలో జేజే యాక్ట్ అమలయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి చెప్పారు. కొవిడ్ సమయంలో అనాథ పిల్లలకు ఎడ్యుకేషన్ సపోర్ట్ చేశామని, జేజే ఫండ్ నుంచి వారికి స్కూల్ ఫీజు చెల్లించినట్లు తెలిపారు. 655 మంది అనాథలకు నిత్యావసర సరుకులు ఇచ్చామని జిల్లా స్త్రీ శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారి మోతీ వివరించారు. పసిపిల్లలు తప్పు చేస్తే వారు అలా చేయడానికి కారణాలు తెలుసుకుని.. తిరిగి పిల్లలు అలా తప్పులు చేయకుండా చూడాలని, వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని జస్టిస్ బోర్డ్ సోషల్ వర్కర్ సిబ్బంది తెలిపారు. అనాథ పిల్లలకు ప్రభుత్వమే అండగా ఉంటుందని, ఎవరు కూడా అనాథలుగా ఉండటానికి వీలు లేదని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏసీపీ సలీమా, డీసీపీ కిశోర్ స్పష్టం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ సంరక్షణ కేంద్రాల నుంచి వచ్చిన పిల్లలు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఆటల పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యలో ప్రతిభ కనబర్చిన వారికి నగదు, బహుమతులు ప్రదానం చేసినట్లు తెలిపారు. పిల్లలతో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో బీఆర్సీ కో-ఆర్డినేటర్ హర్షవర్ధిని, బాలల సంరక్షణ అధికారి ప్రవీణ్కుమార్, సీడీపీవోలు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, వివిధ సీసీఐల ఇన్చార్జీలు, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్లు ఉన్నారు.