సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కారణంగా అనాథలైన పిల్లల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా సహకరించేందుకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందుకొచ్చింది. 200 మంది విద్యార్థులకు పదో తరగతి వరకు చదివించేందుకు సాయం అందిస్తున్నారు. ఈ ఏడాది జూలై నెలలో 17 మంది పిల్లల విద్యాభ్యాసం కోసం ఎస్సీఎస్సీ చెక్కులను అందించింది. తాజాగా గురువారం మరో 10 మంది విద్యార్థులు చదువుకునేందుకు అవసరమైన సామగ్రి, పుస్తకాలు, బుక్లు, పెన్నులు, పెన్సిళ్లు, స్కూలు ఫీజులను పోలీసు కఘమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చేతుల మీదుగా అందించారు. ఈ విద్యార్థులకు విద్యాభ్యాసం అందేలా సహాయం చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు సంప్రదించడంతో ఎస్సీఎస్సీ అధికారులు వారికి చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎస్సీ కార్యదర్శి కృష్ణ ఏదుల, రంగారెడ్డి జిల్లా సంక్షేమ శాఖ అధికారి, తెలంగాణ ఐటీ ఇన్వెస్ట్మెంట్ సీఈఓ విజయ్ రంగినేని, ఎస్సీఎస్సీ కో- ఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.