ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత కూడా ఉప్పూ నిప్పులాగే ఉంటున్న అమెరికా, రష్యా.. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో మరోసారి కత్తులు నూరుకుంటున్నాయి. ఉక్రెయిన్కు అమెరికాతోపాటు బ్రిటన్ తదితర నాటో దేశాలు బాసటగా నిలువటమే కాదు రష్యాకు గట్టి హెచ్చరికలు పంపిస్తున్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమిస్తే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని, అవసరమైతే నాటో దళాల్ని రంగంలోకి దింపుతామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్య పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నది. ఇటీవల జీ-7 కూటమి కూడా ఇదే రకమైన ఘాటు వాఖ్యలతో హెచ్చరించింది. దీనికి ప్రతిగా, తమను ఇలాగే రెచ్చగొడితే 1962 నాటి క్యూబా సంక్షోభం తరహా పరిస్థితులు పునరావృతమవుతాయని రష్యా విదేశాంగమంత్రి హెచ్చరించారు. నాడు అమెరికా, రష్యా దాదాపుగా అణుయుద్ధం సమీపానికి వచ్చి నిలిచిపోయాయి.
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1991లో సోవియట్ యూనియన్ రద్దు నేపథ్యంలో ఉక్రెయిన్ స్వతంత్రదేశంగా అవతరించింది. పొరుగునున్న యూరప్ దేశాలతో సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకోవటానికి ఉక్రెయిన్ ప్రయత్నించటం రష్యాకు ఆగ్రహం తెప్పించింది. నాటోలో చేరవద్దని, ఆ సైనిక కూటమి ఆయుధ సామగ్రిని తన భూభూగంలోకి అనుమతించవద్దని ఒత్తిడి తెచ్చింది. ఆ దేశ రాజకీయాల్లో రష్యా జోక్యం కూడా పెరిగిపోసాగింది. 2014లో రష్యా అనుకూల అధ్యక్షుడిని ఉక్రెయిన్ ప్రజలు గద్దె దించారు. దీంతో రష్యా ఏకంగా సైన్యాన్ని పంపించి ఉక్రెయిన్ భూభాగమైన క్రిమియాను ఆక్రమించుకుంది. రష్యా మద్దతుదారులు తూర్పు ప్రాంతాలలో తిరుగుబాటు ప్రారంభించారు. దీంతో ఉక్రెయిన్లో అంతర్యుద్ధం మొదలైంది.
ప్రస్తుతం సరిహద్దుల వద్ద రష్యా భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించిందని ఉక్రెయిన్ ఆరోపిస్తున్నది. వచ్చే ఏడాది జనవరిలోపే ఆక్రమణకు దిగవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇదంతా బూటకపు ప్రచారమని, అమెరికా, పశ్చిమదేశాలు ఆడిస్తున్న ఆట అని రష్యా బదులిస్తున్నది. తమ దేశాన్ని, పొరుగు ప్రాంతాన్ని అస్థిరపరిచి తమను దెబ్బతీయటానికి ఉక్రెయిన్ను అడ్డం పెట్టుకొని పశ్చిమదేశాలు చేస్తున్న కుట్రలే ఈ సంక్షోభమని కొట్టిపారేస్తున్నది. ఉక్రెయిన్లు-రష్యన్లది ఒకే జాతి అని పుతిన్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఉక్రెయిన్ కూడా భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించినట్లు తెలుస్తున్నది. మొత్తమ్మీద తూర్పు యూరప్లో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. పరిస్థితులు మరింత తీవ్రతరం కాకముందే ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగి, సంక్షోభాన్ని చర్చల ద్వారా నివారించే ప్రయత్నం చేపట్టాలి. అసలే కరోనా మహమ్మారితో కకావికలమవుతున్న ప్రపంచంపైన మరో సంక్షోభాన్ని మోపకుండా తక్షణం చర్యలు తీసుకోవాలి.