ముందుచూపు ముక్కుసూటితనం, నిర్భయత్వం, సాహసం- భారత సైనిక దళాల తొలి అధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ వ్యక్తిత్వాన్ని, జీవితాన్నివెల్లడించే మాటలు ఇవి. వీటివల్లే ఆయన సైనిక జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. వీటివల్లే నేడు ఆయన సేవల్ని జాతి యావత్తూ గుర్తు చేసుకొని గర్విస్తున్నది. భారత్కు రక్షణపరంగా దీర్ఘకాలంలో పొంచి ఉన్న ముప్పు పాకిస్థాన్తో కాదు, చైనాతోనే అని రావత్ చాలా ఏండ్ల క్రితమే ఊహించి చెప్పారు. అది 2017లో డోక్లాం ప్రతిష్టంభనతో, ఆ తర్వాత మూడేండ్లకు లఢక్లోని గల్వాన్లో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణతో నిజమని తేలింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను కూడా జనరల్ రావత్ ఒక నికార్సయిన సైనికుడి కోణంలోనే చూశారు. భవిష్యత్తులో బయోవార్లు జరుగుతాయని, వాటికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఇటీవల కరోనాపై జరిగిన ఓ సదస్సులో హెచ్చరించారు.
సవాళ్లు వచ్చినప్పుడు ఎదుర్కోవటం కాదు, సవాళ్లను వెతుక్కుంటూ వెళ్లి వాటిని తుదముట్టించటం సైన్యాధికారిగా బిపిన్ రావత్ శైలి. జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదంతో, ఈశాన్య రాష్ర్టాల్లో మిలిటెన్సీతో ఆయన ఈ విధంగానే వ్యవహరించారు. తడబాటు లేని ఈ వైఖరి వల్లనే ఉగ్రవాదులను, మిలిటెంట్లను హడలెత్తించి నిలువ నీడ లేకుండా చేశారు. సైన్యాధిపతిగా, సీడీఎస్గా అత్యున్నత స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వైఖరి అదే. 2015లో సైన్యంపై దాడి చేసిన నాగా వేర్పాటువాదులు మయన్మార్లో దాక్కుంటే ఆ దేశ భూభాగంలోకి వెళ్లి వారిని తుదముట్టించడంలో, 2016లో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాదుల శిబిరాలపై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్లో, 2019లో పాకిస్థాన్లోని బాలాకోట్లో ఉన్న జైషే ఉగ్రవాదుల శిక్షణ శిబిరంపై జరిపిన వాయుసేన దాడిలో జనరల్ రావత్ కీలకంగా నిలిచారు.
దేశ చరిత్రలో తొలిసారిగా, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటైన సీడీఎస్ పదవిలో జనరల్ రావత్ను నియమించటం.. నాలుగు దశాబ్దాలకుపైగా దేశానికి ఆయన అందించిన నిరుపమానమైన సేవలకు దక్కిన గౌరవం. ఆ పదవిని రావత్ అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. త్రివిధ దళాలను సమన్వయపర్చటానికి, థియేటర్ కమాండ్ను ఏర్పాటు చేయటానికి అహరహం శ్రమించారు. గత రెండేండ్లుగా పకడ్బందీ కార్యాచరణతో, నిర్ణీత గడువులతో ముందుకు సాగారు. సైనికదళాల్లో అతిపెద్ద సంస్కరణల పర్వానికి మార్గదర్శిగా నిలిచారు. దళాల సమన్వయానికి ఎంత శ్రద్ధ వహించారో, ఆధునికీకరణకు, సామర్థ్యాన్ని పెంచటానికి కూడా అంతే ప్రాధాన్యతనిచ్చి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మహాయజ్ఞం ఫలితాలనిస్తున్న తరుణంలో అంతటి మార్గదర్శిని కోల్పోవటం మన దురదృష్టం. జనరల్ బిపిన్ రావత్ చూపిన మార్గంలో సైనికదళాల సంస్కరణల పర్వాన్ని పూర్తి చేయటమే ఆయనకు నిజమైన నివాళి.