చేతికున్న ఐదు వేళ్ళు సమానంగా ఉండవు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే రకంగా ఉండరు. అలాగే ఒకే క్లాసు చదివే పిల్లలందరికీ ఒకే రకమైన తెలివితేటలుండవు. అందరు పిల్లలు అన్ని అంశాల లోనూ సమానమైన ప్రతిభను ప్రదర్శించరు. ఒక్కొక్కరికి ఒక్కో అంశం మీద ఇష్టం ఉంటుంది.
ఇష్టం ఉన్న పని మీద సహజంగానే శ్రద్ధ కనబరచడం వల్ల దాన్లో ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. అయితే ఇష్టం ఉన్నా, లేకున్నా ప్రతి విద్యార్థి కొన్ని విషయాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి.
పెద్దలను గౌరవించడం, పరిశుభ్రంగా ఉండ టం, చక్కని దస్తూరీతో రాయడం, నలుగురికీ అర్థమయ్యేలా చదువగలగడం, మనలోని భావాలను మంచి భాషతో వెల్లడించగలగడం వంటివి ప్రతీ వ్యక్తి జీవితంలో ఎంతో అవసరమైనటువంటివి. పిల్లలు నేర్చుకునేవిధంగా ఆ విషయాల పట్ల వారికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆసక్తి కలిగించాలి. మంచి ప్రోత్సాహం, తగిన అవకాశాలు ఇవ్వాలే గానీ అద్భుతమైన ప్రతిభ కనబరచగలమంటూ ఎందరో చిన్నారులు నిరూపిస్తూనే ఉన్నారు.
సాధారణంగా స్కూల్లో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు అందులో పాల్గొనటానికి ఎవరెవరు ముందుకొస్తారు? అని పిల్లల్నే అడుగుతారు. నేను చేస్తానంటూ ముందుకువచ్చిన పిల్లల చేతే పాటలు పాడించడం, డ్యాన్సులు చేయించటం, ఉపన్యాసాలు ఇప్పించడం సాధారణం. చేస్తామంటూ ముందుకువచ్చిన పిల్లలు అభినందనీయులే. ఈ పిల్లలతో ఒకటికి, రెండుసార్లు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఆయా పనుల్లో వారికి అనుభవం వస్తుంది. ఈసారి ఆ పిల్లలతోపాటు బిడియపడే, భయపడే మనస్తత్వం ఉన్న పిల్లలను కూడా కలిపితే వారిలో కూడా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కొందరు పిల్లల్లో.. కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉంటుంది. కానీ తాము ఆ పనిచేయగలమో లేదో అనే ఊగిసలాట. సరిగా చేయలేకపోతే తోటి పిల్లలు నవ్వుతారని, టీచర్లు కోప్పడతారని భయం ఉంటుంది. ఈ కారణంగా వారు ముందుకురాలేరు. అటువంటప్పుడు టీచర్లు ధైర్యం చెప్పి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి, మేమే చేస్తామంటూ వారంతట వారే ముందుకు వస్తారు.
హనుమంతుడంతటి వాడికే పక్కనున్న వారు ప్రోత్సహించేదాకా తన శక్తి తనకు తెలియలేదట. కాబట్టి స్కూళ్లలో పిల్లలకు తగిన ప్రోత్సాహాన్ని అందించాలి. స్కూల్లో రోజూ జరిగే ప్రార్థన, నీతిసూత్రాలు చెప్పించడం, శ్లోకాలు, పద్యాలు చదివించటం, క్విజ్ కార్యక్రమాలు మొదలైనవాటిలో క్లాసులోని ప్రతి విద్యార్థి పాల్గొనేలా చూడాలి. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనది. స్కూల్లో ఏయే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ముందుగా తల్లిదండ్రులు తెలుసుకొని తమ పిల్లల్ని ఆయా కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యేలా చూడాలి. అయితే తల్లిదండ్రులు మాత్రమే ప్రోత్సహిస్తే సరిపోదు. ఇంట్లో ఎంత ప్రోత్సహించినా పిల్లలకు స్కూల్లోని టీచర్ల వద్ద నుంచి తగిన సహకారం లభించకపోతే ఉపయోగం ఉండదు. వేదిక మీద ప్రదర్శన ఇవ్వటానికి ముందే పిల్లలకు టీచర్లు తగిన సూచనలిస్తుంటారు. అయినప్పటికీ పిల్లలు స్టేజీ మీద ప్రదర్శన ఇచ్చినప్పుడు తప్పులు దొర్లవచ్చు లేదా భయంతో ఏమీ చేయలేకనూ పోవచ్చు. అలాంటప్పుడు టీచర్లు ‘నీకు నిన్నంతా నేర్పించాను కదా! అయినా ఏమిటలా చేయడం’ అంటూ మందలించకూడదు. ఇలా చేస్తే ఇంటివద్ద తల్లిదండ్రులు ఎంత ప్రోత్సహించినా ‘మీకేం తెలుసు! ఇంట్లో కూర్చుని చెప్తారు. సరిగ్గా చేయకపోతే మా టీచర్లు బాగా తిడతారు’ అంటూ పిల్లలు భయంతో అసలు ముందుకే రాకుండా వెనకడుగు వేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తప్పు ఎక్కడ జరిగిందో.. టీచర్లు వివరించి, పిల్లల చేతే మళ్లీ తప్పు జరగకుండా చేయిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ స్టేజ్ ఫియర్తో ఉపన్యసించలేని ఉద్యోగులు, అధికారులను ఎంతోమందిని చూస్తుంటాం. అలాగే మంచి భావప్రకటన సామర్థ్యం కలిగినవాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కూడా చూస్తూనే ఉంటాం. ఒక విషయాన్ని ఎంత బాగా అర్థం చేసుకోగలిగినప్పటికీ ఆ విషయాన్ని నలుగురికీ అర్థమయ్యేలా చెప్పలేకపోవడం వల్ల విద్యార్థులు మంచి అవకాశాలను కోల్పోతారు. ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు, ఉన్నత చదువుల్లో వైవా వంటివి విద్యార్థుల్లోని భావ ప్రకటనను వెలికితీసేటటువంటివే. కాబట్టి చిన్నతనం నుంచే పిల్లల్లోని స్టేజ్ ఫియర్ను పోగొట్టడానికి ప్రయత్నించాలి. ‘నువ్వే మీ చేయలేవు! నీకేం రాదు! అం టూ నిరుత్సాహపర్చకుండా.. నువ్వు బాగా చేస్తావు. చెయ్యగల వు’ అని భుజం తట్టి ధైర్యం చెప్తూ ముందుకుసాగేలా పిల్లలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలి. అప్పుడే ప్రతి విద్యార్థిలోని ప్రతిభ బయటకువచ్చి ప్రతిభావంతులుగా ఎదుగుతారు. విద్యతో పాటు ఇతర రంగాల్లో రాణించగలుగుతారు.
డా. కందేపి రాణీప్రసాద్