కేంద్ర ప్రభుత్వానికి ఉన్న విస్త్రృత అధికారాలు రాష్ర్టాలకు శాపంగా మారాయి. దీంతో రాష్ర్టాలపై కేంద్రం వివక్ష చూపుతున్నది. ఆ వివక్ష తెలంగాణపై కొంచెం ఎక్కువే ఉన్నది. అయినా బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పయనిస్తుండటం కేంద్రానికి కంటగింపవుతున్నది. రాజకీయపార్టీల లక్ష్యం ఎన్నికల్లో గెలుపే తప్ప అభివృద్ధి, ప్రజా సంక్షేమం కాదని బీజేపీ నాయకుల మాటల్లో అర్థమవుతున్నది. దానికి తాజా ఉదాహరణే ‘డబుల్ ఇంజిన్ గ్రోత్’.
డబుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్న బీజేపీ నేతలు నడుపుతున్న బండి ఇంజిన్ డబుల్ది కాదు డల్ ఇంజిన్ అర్థమవుతున్నది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 8 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయదలచింది. అదే సమయంలో దేశానికి మోదీని ప్రధానిగా చేసిన గుజరాత్ రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా కేవలం 3 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఆసరా పింఛన్ల విషయంలో డబుల్ ఇంజిన్ కలిగిన గుజరాత్లో పేదలకు ఇస్తున్న పింఛన్ నెలకు రూ.750 మాత్రమే.
అభివృద్ధి అనే పదం వచ్చినప్పుడల్లా మొదట గుర్తొచ్చేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే.. ఈ సందర్భంగా గత ఏడున్నరేండ్లలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. నీళ్లు- నిధులు- నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ ఆ నినాదాన్ని ఏనాడూ మరిచిపోలేదు.
నిధులు: తెలంగాణ ఏర్పడేనాటికి తలసరి ఆదాయం రూ.1,24,104 కాగా, నేడు రూ.2,78,833కి చేరింది. ఏడాదిలోనే తెలంగాణ జీఎస్డీపీ పెరుగుదల రేటు 14.7 శాతం. అదే సమయంలో తలసరి ఆదాయం వృద్ధి 18.8 శాతంగా నమోదైంది. 2014-15లో తెలంగాణ జీఎస్డీపీ వృద్ధిరేటు 6.8 శాతం కాగా, కేంద్రానిది 7.4 శాతం. అయితే 2021-22 నాటికి తెలంగాణ జీఎస్డీపీ వృద్ధి రేటు 11.2 శాతానికి చేరుకోగా, జాతీయ జీడీపీ వృద్ధి రేటు 8.9 శాతం. ఇక జాతీయ స్థాయిలో తెలంగాణ తలసరి ఆదాయంలో, వృద్ధిరేటులో మొదటి స్థానంలో నిలువగా, యూపీది ఏడో స్థానం. గుజరాత్కు మొదటి పది స్థానాల్లో కనీసం చోటే దక్కలేదు. తెలంగాణ ఏర్పడేనాటికి బడ్జెట్ రూ.1,00,637 కోట్లు కాగా, నేడు రూ.2,56,958 కోట్లకు చేరింది. సంక్షేమ రంగానికే రూ.54 వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం అభినందనీయం.
నీళ్లు: ఆరు దశాబ్దాలపాటు వివక్షకు గురైన తెలంగాణ సాగునీటిరంగం ఇప్పుడు దేశానికే తలమానికం. పల్ల్లమెరిగే నీటిని ఒడిసిపట్టి పైనున్న బీడు భూములకు మళ్లిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో ‘లక్ష కోట్ల రూపాయల సాగునీటి పెట్టుబడి- కోటి ఎకరాల మాగాణి’ సాకారమైంది. ‘మిషన్ కాకతీయ’, ‘కాళేశ్వరం’, చిన్న, మధ్య, భారీతరహా సాగునీటి ప్రాజెక్టులన్ని కలిసి బీడు భూములను పాడి పంటలతో సస్యశ్యామలం చేశాయి. రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంటు అనే సంక్షేమ పథకాలను సైతం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర సర్కారు సైతం తెలంగాణ పథకాలను కాపీ కొట్టింది.
నియామకాలు: రాష్ట్ర ప్రభుత్వం ఏడున్నరేండ్లలో 1 లక్షా 32 వేల 899 ఉద్యోగాలను భర్తీ చేసింది. మరో 91,147 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నవారిని క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో దాదాపు 80 వేల పైచిలుకు ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. అదే సమయంలో కేంద్రంలో భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య 15,66,000. ఇదిలా ఉంటే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తూ, ప్రైవేటుపరం చేస్తూ లక్షల మంది ఉద్యోగుల జీవితాలను కేంద్రం రోడ్డు మీదకు తెస్తున్నది.
2018, సెప్టెంబర్లో ప్రధాని మోదీ ఓ సమావేశంలో పాల్గొని దేశ ఆర్థికవ్యవస్థ 2022 నాటికి రెట్టింపవుతుందన్నారు. కానీ 2018లో 2.7 ట్రిలియన్ డాలర్లు కాగా, 2022 నాటికి 3.36 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక భారతదేశంలో 2022 నాటికి బుల్లెట్ ట్రైన్ నడిపిస్తామని 2018 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ సెలవిచ్చారు. ఇంకా బుల్లెట్ రైలు పట్టాలే ఎక్కకపోవడం విడ్డూరం. గుజరాత్ మోడల్ అని చెప్పుకొనేవారు గమనించాల్సిందేమంటే.. గుజరాత్లో రైతులకు 8-9 గంటల కరెంటు ఇస్తుంటే తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్నది. ఇక తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన ఉన్నది. తెలంగాణ విద్యుత్ వినియోగం 9.2 శాతం కాగా గుజరాత్, యూపీ రాష్ర్టాలది 4 నుంచి 5 శాతం లోపే.
డబుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్న బీజేపీ నేతలు నడుపుతున్న బండి ఇంజిన్ డబుల్ది కాదు డల్ ఇంజిన్ అని అర్థమవుతున్నది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 8 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయదలచింది. అదే సమయంలో మోదీని దేశానికి ప్రధానిగా చేసిన గుజరాత్ రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా కేవలం 3 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. డబుల్ ఇంజిన్ కలిగిన గుజరాత్లో పేదలకు ఇస్తున్న పింఛన్ నెలకు రూ.750 మాత్రమే. అసోంలో రూ.200, యూపీలో రూ.500 మాత్రమే. సుదీర్ఘకాలం మధ్యప్రదేశ్ను పాలించిన బీజేపీ ఇప్పటికీ ఇస్తున్న సామాజిక పింఛన్ రూ.300 మాత్రమే. ఇక అప్పుల విషయానికి వస్తే తెలంగాణ జీఎస్డీపీలో 25 శాతానికి మించకుండా అప్పులు తీసుకున్నది. కేంద్రం మాత్రం రూ.4 లక్షల కోట్ల మేర ప్రభుత్వ ఆస్తులను అటు వేలం వేసింది, ఇటు అమ్మింది. సర్కారు సంస్థలను నిర్వీర్యం చేసింది. ‘డబుల్ ఇంజిన్ గ్రోత్’ అంటే ఇదేనా?..
(వ్యాసకర్త: అధ్యక్షులు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉద్యోగుల సంఘం)
డాక్టర్ పుల్లా శ్రీనివాస్
98498 43733