విద్యుత్ ప్రవాహ వేగంతో అభివృద్ధి చెందుతూ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్కు కనీస అవసరంగా విద్యుత్ సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అన్నిరంగాల వినియోగదారులకు 24 గంటల విద్యుత్ను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ. వ్యవసాయ, పారిశ్రామికరంగాల అవసరాలు తీరుస్తూ అభివృద్ధి పథంలో శరవేగంతో దూసుకుపోతున్నది.
రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో విద్యుత్ ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నది. సాఫ్ట్వేర్, ఐటీ, పారిశ్రామిక బహుళజాతి కంపెనీల ఏర్పాటుతో పాటు, వాణిజ్యపరంగా జెట్ వేగంతో ఎదుగుతు న్న హైదరాబాద్ విద్యుత్ అవసరాలు ఏటా 10-12 శాతం వరకు పెరుగుతున్నాయి. గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్పల్లి, నానక్రాంగూడ, కోకాపేట్, నార్సింగి తదితర ప్రాంతాల్లో విద్యుత్ వాడ కం పెరుగుతున్నది. అంతేకాకుండా మేడ్చల్, జీడిమెట్ల, కీసర, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, మహేశ్వ రం, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో కూడా విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ ప్రైమ్ ఆఫీస్ స్పేస్లను ఈ ప్రాంతంలో నెలకొల్పడానికి ‘టీఎస్ ఐపాస్’ లాంటి కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. వీటన్నింటికీ భౌగోళికంగా హైదరాబాద్ అనుకూలతలు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
ప్రపంచ ప్రఖ్యాత కార్పొరేట్ కంపెనీలు వారివారి యూనిట్లను స్థాపించే ముందు విద్యుత్ లభ్యతను, ఇంకా ఇతర అనుకూల అంశాలను కూడా అంచనా వేస్తాయి. అందుకోసం హైదరాబాద్ విద్యుత్ ట్రాన్స్మిషన్ సామర్థ్యాన్ని పెంచడానికి టీఎస్ ట్రాన్స్కో, నగరం నడిబొడ్డున రాయదుర్గంలో 400 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి పూనుకున్నది. 400 కేవీ లాంటి అతిపెద్ద ఈహెచ్టీ సబ్స్టేషన్ను జన సమ్మర్థంతో కిటకిటలాడే నగరంలోకి తీసుకురావడం ఆషామాషీ వ్యవహారం కాదు.
గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ (జీఐఎస్)గా పిలవబడే రాయదుర్గం సబ్స్టేషన్లో 400 కేవీ/ 220 కేవీ/ 132 కేవీ/33 కేవీ సబ్స్టేషన్లు అన్నీ ఒకే ప్రాంగణంలో ఉండటం బహుశా దేశ చరిత్రలోనే ప్రథమంగా పేర్కొనవచ్చు. ఐదెకరాల కనీస విస్తీర్ణంలో సబ్స్టేషన్ నిర్మించడం ఒక ఎత్తు అయితే, చేవెళ్ల సమీపంలోని కేతిరెడ్డిపల్లి 400 కేవీ సబ్స్టేషన్ నుంచి 400 కేవీ లైన్లను రాయదుర్గంకు తీసుకురావడం ఒక సవాలు. సంప్రదాయక టవర్లు వేయడానికి ఒక్కో టవరుకు కనీసం 500 గజాల స్థలం అవసరం ఉంటుంది. కేతిరెడ్డిపల్లి నుంచి పరిస్థితులు అనుకూలించే ఓఆర్ఆర్ వరకు 29 కిలోమీటర్లు సంప్రదాయక టవర్ల ద్వారా లైన్లు వేయగా, ఓఆర్ఆర్ వెంబడి 11 కిలోమీటర్ల మేర మొదటిసారిగా మోనోపోల్స్ వాడటం గమనార్హం. తక్కువ స్థలంలో, తక్కువ సమయంలో వేగంగా నిర్మించడానికి అవకాశం ఉన్న ‘మోనోపోల్ టవర్లు’ సుమారు 50 మీటర్ల వరకు ఎత్తు ఉంటాయి. వీటి నిర్మాణానికి రూ.143 కోట్లు వ్యయం చేసినట్లు తెలుస్తున్నది. ‘మోనోపోల్’కు కేవలం రెండున్నర మీటర్ల స్థలమే సరిపోవటం గమనించదగినది.
గచ్చిబౌలి జంక్షన్ నుంచి సబ్స్టేషన్ వరకు 3 కి.మీ. మేర భూగర్భ కేబుల్ వేశారు. దక్షిణ భారతంలోనే ఇలాంటి సబ్స్టేషన్ తొలిసారి వేస్తున్నారు. రాయదుర్గం 400 కేవీ సబ్స్టేషన్లో 500 మెగా వోల్ట్ ఆంపియర్స్ సామర్థ్యం ఉన్న రెండు పవర్ ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తుండగా, భవిష్యత్తులో మరో రెండు పవర్ ట్రాన్స్ఫార్మర్లు నెలకొల్పనున్నారు. అంటే ఈ ఒక్క సబ్స్టేషన్ ద్వారా హైదరాబాద్ నగరానికి 2000 మెగావాట్ల విద్యుత్ అదనపు సామ ర్థ్యం అందుబాటులోకి రానున్నది. అదేవిధంగా 220 కేవీ సబ్స్టేషన్లో 160 మెగా వోల్ట్ ఆంపియర్స్ సామర్థ్యం కలిగిన మూడు పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటుచేస్తున్నారు. 132 కేవీ సబ్స్టేషన్ పరిధిలో 80 మెగావోల్ట్ ఆంపియర్స్ సామర్థ్యం ఉన్న మూడు పవర్ ట్రాన్స్ఫార్మర్లు నెలకొల్పుతున్నారు. ఈ సబ్స్టేషన్కు 400 కేవీ లైన్లను కేతిరెడ్డిపల్లి, శంకర్పల్లి నుంచి తీసుకువస్తున్నారు. రాయదుర్గం 400 కేవీ సబ్స్టేషన్ నుంచి గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, ఎర్రగడ్డ, మియాపూర్, కైతలాపూర్ 220 కేవీ సబ్స్టేషన్లకు 220 కేవీ ఫీడర్లను పొడిగిస్తున్నారు. అదేవిధంగా 220 కేవీ సబ్స్టేషన్ నుంచి మాదాపూర్, జుబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, ఎర్రగడ్డ, మణికొండ 132 కేవీ సబ్స్టేషన్లకు 132 కేవీ ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానున్నది. ఇదే ప్రాంగణంలో ఉన్న 132/33 సబ్స్టేషన్ ద్వారా 12 ఫీడర్లను వివిధ సబ్స్టేషన్లకు, వినియోగదారులకు అందించనున్నా రు. భవిష్యత్ అవసరాలను దృష్టి లో ఉంచుకొని 132 కేవీ కేబుళ్లను 630 స్క్వేర్ మిల్లీ మీటర్ల బదులు గా, 1200 స్క్వేర్ మిల్లీమీటర్ల కేబుళ్లను ఉపయోగిస్తుండటం విశేషం.
రాష్ట్ర ఆవిర్భావం నాటికి హైదరాబాద్ నగర విద్యుత్ డిమాండ్ 2400 మెగావాట్లు. కాగా, 2019 మే నెలలో 3400 మెగావాట్లుగా నమోదైంది. గత రెండేండ్లుగా కొంత స్తబ్ధత కనిపించినప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లయితే ఈ డిమాండ్ 5000 మెగావాట్లు దాటవచ్చని అంచనా. ప్రస్తుతం హైదరాబాద్ ట్రాన్స్మిషన్ సామర్థ్యం 5000 మెగావాట్లు.
రాబోయే 20 ఏండ్లలో ఏర్పడబోయే సుమారు 1600 మెగావాట్ల విద్యుత్ అవసరాలను తీర్చడమే ప్రధానధ్యేయంగా ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ సబ్స్టేషన్ ఏర్పాటుతో హైదరాబాద్ నగరం చుట్టూ తొమ్మిది 400 కేవీ సబ్స్టేషన్లు మల్కాపురం, ఘణపూర్, మామిడిపల్లి, మహేశ్వరం, కేతిరెడ్డిపల్లి, శంకర్పల్లి, గజ్వేల్, నర్సాపూర్లతో వలయాకారం గ్రిడ్ పూర్తయినట్లయింది. ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు నిరంతర పర్యవేక్షణలో రూ.1400 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయిన రాయదుర్గం 400/ 220/13 2/33 కేవీ సబ్స్టేషన్ను సీఎం కేసీఆర్ హైదరాబాద్ ప్రజలకు అంకితం చేయనుండటం హర్షణీయం.
(వ్యాసకర్త: టీఎస్ ఎస్పీడీసీఎల్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్- అధ్యక్షులు)