ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో. పార్లమెంటులో తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో బీజేపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. జై శ్రీరామ్ అని పలకరించుకునే కమలనాథులు పార్లమెంటులో మోదీ ఎపిసోడ్ తర్వాత ఇప్పడు ‘పాయే.. అంతా పాయే..’ అంటూ నెత్తిన గుడ్డ వేసుకొని బాబుమోహన్ చెప్పే సినిమా డైలాగ్ను జపిస్తున్నారు. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని భావిస్తున్న తరుణంలో తమ ఆశలపై మోదీ నీళ్లు చల్లారని తెగ బాధపడిపోతున్నారు. ఇంతకాలం తాము పడిన శ్రమను అంతా మోదీ చేసిన ఒక్క వ్యాఖ్యతో తుడుచుపెట్టుకుపోయిందని వాపోతున్నారు. ‘మొగడు తిట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు బాధ అయిందన్న’ చందంగా తెలంగాణ బిల్లు పాస్ చేయించడంలో కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని మోదీ అనడం కూడా పరోక్షంగా కాంగ్రెస్కు మేలు చేసేలా ఉన్నదని కమలనాథులు తెగ బాధపడిపోతున్నారు.
నారాయణ… నారాయణ !
కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటంలో సీపీఐ నేత నారాయణకు ఎవరూ సాటిరారు. ప్రపంచం మారినా కమ్యూనిస్టులు మాత్రం మారలేదని ఇటీవల ఆయన ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అభ్యుదయవాదులమని చెప్పుకోవడమే కానీ అడ్వాన్స్గా ఆలోచించకపోవడం వల్లనే తమ పార్టీలకు అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల ప్రజలకు గౌరవం ఉన్నా.. తమ పట్ల విశ్వాసం పోయిందన్నారు. బీజేపీ గురించి తాము ఎక్కువగా మాట్లాడటం వల్ల జనం తమను మరిచిపోయి ఆ పార్టీని లైవ్లో ఉంచడం కూడా కమ్యూనిస్టు పార్టీల తప్పిదమేనని నారాయణ వాపోయారు.
గిదేం రాజకీయం రేవంత్?
‘పార్టీలో సీనియర్ను, గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన. తనను పట్టుకొని ఒక నాయకుడు బండ బూతులు తిడితే మా పీసీసీ అధ్యక్షుడు స్పందిస్తారనుకున్న. కానీ, ఆయన నన్ను తిట్టిన నాయకుడి ఇంటికెళ్లి ఇంకా బాగా తిట్టమని, డోస్ పెంచ’మని సలహా ఇచ్చినట్టు తెలిసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు విలేఖరుల వద్ద వాపోయారు. ‘మేం కూడా రాజకీయాలు చేశాం కానీ.. ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు’ అని హన్మంతన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు జరిగిందేమంటే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు ఇటీవల వీహెచ్ను దుర్భాషలాడి అవమానపరిచారు. దీనిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీకి వీహెచ్ ఫిర్యాదు చేయగా ప్రేమ్సాగర్రావుకు సంజాయిషీ నోటిసు జారీచేసింది. అయితే ఆ నోటీసు ఇచ్చిన రోజున సాయంత్రమే రేవంత్రెడ్డి ప్రేమ్సాగర్ ఇంటికెళ్లి మాట్లాడివచ్చారు. తన ఇంటికి వస్తారనుకుంటే ఆయనేమో ప్రేమ్సాగర్రావు ఇంటికెళ్లి డోస్ పెంచమని చెప్పినట్టు తెలిసిందని వీహెచ్ విలేఖరులతో వాపోయారు. గివన్నీ చూస్తుంటే తనను పార్టీ నుంచి బయటికి పంపించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుందని వీహెచ్ అనుమానం వ్యక్తం చేశారు..
– వెల్జాల