కంచే చేను మేసే సందర్భం వచ్చినప్పుడు, పాలకుడే పాతకుడైన పరిస్థితి వచ్చినప్పుడు ఉనికి కోసం ఉద్యమించకతప్పదు. జీవిక కోసం పోరాడక తప్పదు. అందుకనే 20 కోట్ల మంది కార్మికులు ‘ప్రజలను కాపాడుకుందాం.. దేశాన్ని రక్షించుకుందాం’ అంటూ వీధుల్లోకి వచ్చి నినాదాలిస్తున్నారు. ఈ రంగం ఆ రంగం అని కాదు.. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు యావత్దేశ కార్మికలోకం బీజేపీ సర్కారు పాశవిక, ప్రజావ్యతిరేక విధానాల్ని తిరస్కరిస్తున్నది. భూగర్భంలోకి దిగి నల్లబంగారం వంటి బొగ్గును తీసుకొచ్చే కార్మికుల నుంచి ఆ బొగ్గుతో కరెంటు ఉత్పత్తి చేసి దేశాన్ని వెలుగుల్లో నింపే విద్యుత్ సంస్థల ఉద్యోగుల వరకూ.. ఉత్తరాలు బట్వాడా చేసే పోస్టల్ సిబ్బంది నుంచి ఆర్థిక సేవలు అందించే సమస్త బ్యాంకుల సిబ్బంది వరకూ అనేక రంగాల ఉద్యోగులు, కార్మికులు రెండురోజుల భారత్బంద్లో కదం తొక్కుతున్నారు.
ప్రజల మధ్య చీలికలు తెచ్చే, మానని గాయాల్ని మరింత పచ్చిగా చేసే కశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలు తీస్తే.. ఏకంగా ప్రధానే ఆ దర్శకుడిని భుజం తట్టి ప్రోత్సహిస్తారు. కానీ, కోట్లాది కుటుంబాలను చిన్నాభిన్నం చేసే ప్రైవేటీకరణ విధానాలు వద్దని కార్మికలోకం డిమాండ్ చేస్తే మాత్రం దానిపై స్పందించరు. ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకులు మారుమూల గ్రామాల్లోనూ ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. అటువంటి అద్భుతమైన వ్యవస్థను ప్రైవేటు కుబేరుల చేతుల్లో పెట్టవద్దని లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు కోరుతున్నారు. బ్యాంకులను ప్రవేటుపరం చేస్తే.. అప్పుల కోసం వెనకటికాలంలో వడ్డీవ్యాపారుల మీద ఆధారపడినటువంటి పరిస్థితులు మళ్లీ వస్తాయి. కానీ కార్పొరేట్ల ప్రయోజనాలే తన ప్రయోజనాలుగా భావిస్తున్న మోదీ సర్కార్కు ఈ హెచ్చరికలుగానీ, ఈ విజ్ఞప్తులుగానీ చెవికెక్కటం లేదు.
జై జవాన్, జై కిసాన్ అని నినదించే దేశం మనది. కానీ, ‘దేశభక్తి మెండుగా’ ఉన్న మోదీ సర్కార్ పాలనలో జవాన్ల త్యాగాలను ఎన్నికల రాజకీయాల కోసం ఉపయోగించుకోవటం, కిసాన్ల శ్రమను కార్పొరేట్ల లాభాలు పెంచటానికి వాడటం నిత్యకృత్యమైంది. ఈ దేశాన్ని నడిపించే రథచక్రాల వంటి కార్మికుల సంక్షేమం ఈ ప్రభుత్వానికి పట్టదు. ఈ దేశానికి తిండి పెట్టి జవసత్వాలు నింపుతున్న రైతులన్నా గిట్టదు. అందుకనే కార్మికులు చేపట్టిన భారత్బంద్కు రైతుసంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. గ్రామీణబంద్కు పిలుపునిచ్చాయి. గంటలకొద్ది చాకిరి నుంచి 8 గంటల పనిదినాన్ని సాధించటానికి ప్రపంచ కార్మికలోకం రక్తం చిందించింది. అనేక త్యాగాల తర్వాత అది సాధ్యమైంది. మోదీ సర్కార్ మళ్లీ శతాబ్దాల నాటి ఆ బానిసత్వాన్ని కార్మికులపై రుద్దటానికి 12 గంటల పనిరోజును తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నది. ఇటువంటి ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేవరకూ కార్మిక, కర్షకలోకం విశ్రమించకూడదు.