ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కొద్ది రోజుల కిందట ‘ధర్మ సంసద్’ పేరుతో జరిగిన సమావేశంలో కొందరు ఒక మతానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి. మన దేశాన్ని మతరాజ్యంగా మార్చాలనే అభిప్రాయం వ్యక్తం చేయడంతోపాటు, ఇందుకు ఆయుధాలు ధరించాలని, ప్రాణత్యాగాలకు సిద్ధపడుతూ ఇతర మతస్థుల హననం సాగించాలని పిలుపు ఇవ్వడం దిగ్భ్రాంతికరం. ఎవరి మత భావనలను వారు వ్యక్తం చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఒక మతానికి వ్యతిరేకంగా హింసకు పురికొల్పడం వాంఛనీయం కాదు. ఈ ఉన్మాద ప్రసంగాల గురించిన వార్తను అమెరికాకు చెందిన ప్రఖ్యాత పత్రిక న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిందంటే, అంతర్జాతీయ స్థాయిలో మన దేశ ప్రతిష్ఠకు ఏ స్థాయిలో భంగం కలుగుతున్నదో తెలుస్తున్నది.
ఈ ఉన్మాదకర ప్రసంగాలు చేసిన వారిపై చర్య తీసుకోవడంలో పోలీసులు చూపుతున్న ఉదాసీన వైఖరి కూడా అభ్యంతరకరమే. ఈ రకమైన ప్రసంగాలను ప్రధాని మోదీ స్వయంగా ఖండించి, బాధిత వర్గాలకు భరోసా కల్పించాల్సింది. కానీ ఈ ప్రసంగాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నా, బీజేపీ పెద్దలు మాత్రం ఖండించడం లేదు. ఈ తరహా ప్రసంగాల అనంతరం అల్పసంఖ్యాకవర్గాలపై దాడులు జరిగినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. మోదీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దేశంలో మతం పేర అరాచకశక్తులు పెట్రేగిపోతుండటం ఆందోళనకరం. తినే ఆహారం, కట్టుకునే బట్టలు, అనుసరించే మతం, పుట్టిన కులం ఆధారంగా కూడా అమాయకుల్ని కొట్టి చంపిన దారుణ ఘటనలు అనేకం జరిగాయి. ముఖ్యంగా యూపీ వంటి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇవి ఎక్కువగా చోటుచేసుకోవడం గమనార్హం.
వచ్చే రెండు మూడునెలల్లో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ర్టాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తరువాత జరిగే లోక్సభ ఎన్నికలకు వీటిని సెమీఫైనల్గా భావిస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైన కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎన్నికల ముందు విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు రాల్చుకోవాలనే దుర్బుద్ధితో ఉన్నట్టు తెలుస్తూనే ఉన్నది. అనేక మూడవ ప్రపంచ దేశాలు ఇటువంటి మత అరాచక శక్తుల పాలనలో పడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేక సంక్షోభాన్ని అనుభవిస్తున్నాయి. స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ మన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడం అన్ని రాజకీయ పార్టీల కర్తవ్యం. ఇటువంటి విద్వేష శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక పార్టీలు, సంస్థలు ఏకం కావాలి. జీవనప్రమాణాలను మెరుగుపరిచే విద్య, వైద్యం, ఉద్యోగం, తాగునీరు, సాగునీరు వంటి సామాజిక అంశాలను ఎన్నికల ప్రచారాస్ర్తాలుగా మల్చాలి. మతం పేరుతో జనం మధ్య చిచ్చు పెట్టి, అధికార సోపానాలు అధిరోహించ ప్రయత్నించే ఉన్మాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చాలి.