ఎవరి పేరువింటే 12 మెట్ల కిన్నెర పరవశించి పోతుందో, ఎవరి పేరు వింటే పల్లె గుండె కమనీయ రాగాలు ఒలికిస్తుం దో ఆయనే దర్శనం మొగులయ్య.నాగర్ కర్నూల్ జిల్లాలోని లిం గాల మండలం అవుసలికుంట ఆయన స్వగ్రామం. చదువుకున్నది అంతంత మాత్రమే. కూలి పని చేస్తూనే, తాత తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ‘12 మెట్ల కిన్నెర’తో వీరగాథలను గానంచేస్తూ జీవనం సాగిస్తున్నడు. ప్రస్తుతం తెలుగు ప్రాంతంలో 12 మెట్ల కిన్నెర వాయించే ఏకైక కళాకారుడు దర్శనం మొగులయ్య. పల్లె ఒడినే సంగీత బడిగా చేసుకొని సాగుతున్న సాటిలేని విద్వాంసుడు ఆయన. తెలంగాణ మట్టి వాసనల్ని తన పాటల ద్వారా గుబాళింప జేస్తున్నడు. అలనాటి వీరగాథలకు తన గొంతును అంకితమిచ్చిన నిస్వార్థ కళాకారుడు.
మొగులయ్య హద్దుల్లేని పల్లె పాటల బాటసారి. బతుకు బాటలో సంచార జీవి. సంతలు తిరుగు తూ ఇంటిల్లిపాదికి ఓ ముద్ద అన్నంపెడుతడు. పల్లె పల్లె తిరుగుతూ జనం నోళ్లల్లో పాటై నిలుస్త డు. మీసం మెలేసి వీరగాథలు చెబుతుంటే వినేవారి రోమాలు నిక్క పొడుస్తై. ఆయన చెప్పే వీరగాథల్లో పాలమూరుజిల్లా ప్రాంతంలో సుప్రసిద్ధమైన ‘పండుగ సాయన్న కథ’, ‘మియాసాబ్ కథ’, ‘శంకరమ్మ కథ’, ‘వనపర్తి రాజుల కథ’లు ముఖ్యమైనవి. ‘పాలమూరు జిల్లాకే మొనగాడు సాయన్న’ అంటూ ‘పండుగ సాయన్న’ కథ చెబుతుంటే వినాల్సిందే. ముఖ్యంగా ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా పాటలు పాడుతడు.
పుక్కిటి పురాణాలు అసలే చెప్పడు మొగులయ్య. కడుపు మాడినా సరే.. వీరగాథలను, తెలంగాణ సంస్కృతిని చాటడమే తన లక్ష్యమంటడు. తన కళా ప్రదర్శనతో జానపదానికి జీవం పోస్తున్న సహజ విద్వాంసుడు. తెలంగాణ వీరగాథలను 12 మెట్ల కిన్నెరతో అద్భుతంగా వివరిస్తడు.‘నీళ్లు, అన్నం లేకున్నా పరవాలేదు కానీ కిన్నెర లేకపోతే బతకలేను’ అని కిన్నెరను తన ఆరో ప్రాణంగా భావిస్తడు.
కోటి రాగాలు పలికే మొనగాడే కానీ కూటికి మాత్రం కడు పేద. కుటుంబ పోషణార్థం పట్టణానికి వలస పోయి అడ్డ కూలీగా పనిచేసిండు. వలస పక్షిలా జీవించినా తన ప్రాణప్రదమైన కిన్నెరను వదల్లేదు.
ఇటీవలి కాలంలో తన పాటల ద్వారా సామాజిక చైతన్యాన్ని కలిగిస్తున్నడు. ప్రభుత్వం చేపట్టే పథకాల పట్ల ప్రజలకు అవగాహన కలిగిస్తున్నడు. ప్రభుత్వ బడుల్లో చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గూర్చి వివరిస్తడు. మద్యపానం వల్ల కలిగే అనర్థాలను గానం చేస్తడు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారాన్ని, 2016లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారాన్ని అందుకున్నడు. శిల్పారామంలో, రవీంద్రభారతిలో పలు ప్రదర్శనలిచ్చి పలువురి ప్రశంసలందుకున్నడు. తెలంగాణ రాష్ట్ర భాషా
సాంస్కృ తిక శాఖ మొగులయ్య జీవితంపై డాక్యుమెంటరీని రూపొందించింది. పద్మశ్రీ అందుకున్న మొగులయ్య తెలంగాణకు గర్వకారణం.
( దర్శనం మొగులయ్యకు‘పద్మశ్రీ’ వచ్చిన సందర్భంగా..)
డాక్టర్ తండు కృష్ణకౌండిన్య
97047 31346