పంకజ్ కపూర్ ఆధ్వర్యంలో ‘జుబాన్ సంభాల్కే’ అనే కార్యక్రమం వచ్చేది. ఇంగ్లీషులో ‘మైండ్ యువర్ లాంగ్వేజ్’ అనేది కూడా భాష మీద, మాట జారే వారికి బుద్ధి చెప్పే కార్యక్రమాలు ఇవి. ముఖ్యంగా రాజకీయనాయకులు పరస్పరం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్న సందర్భంలో వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటున్న వేళ.. పై రెండు కార్యక్రమాలు గుర్తుకొస్తున్నాయి.
రాజకీయ నాయకుల మధ్యన వ్యక్తిగత విమర్శ మాటలు ఎబ్బెట్టుగా తయారయ్యాయి. ఇప్పుడది పరాకాష్ఠకు చేరింది. ఏకంగా ఒక రాజకీయ పార్టీ తీర్థం తీసుకొని కూడా ‘యూట్యూబ్ ఛానల్’ నడిపిస్తూ పగబట్టినట్లు వ్యవహరించడం గర్హనీయం. సోషల్ మీడియాను కొందరు ఇందుకోసమే వినియోగిస్తున్నారు. ‘శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు’ తమ ప్రయోజనం కోసం ఇలాంటి వారికి కొన్ని రాజకీయ పక్షాలు మద్దతు పలకడం విడ్డూరం.
కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో సమీక్షలు, పోస్ట్లు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే విచ్చలవిడితనం పరాకాష్ఠకు చేరింది. దేశంలో సామాజికమైనవి, ప్రజాసంబంధమైనవి ఏమీ లేనట్లు.. సీఎం, పీఎం, మంత్రి అనే భేదంలేకుండా, మహిళ అనే సోయి లేకుండా అమర్యాదగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు మితిమీరాయి. వ్యక్తిగత నిందలు, హేళనలు ఎక్కువయ్యాయి.
యూట్యూబ్ ఛానల్స్ దేశంలో చాలా ఉన్నాయి. కొన్ని జనం హితం కోసం అద్భుతంగా పనిచేస్తున్నా యి. ప్రభుత్వ తప్పులతో పాటు, ప్రజా ప్రతినిధులను చివరికి పీఎం, సీఎంలను కూడా నిలదీస్తున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన రైతు ఉద్యమాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా ఎనలేని కృషి చేశాయి. ‘పెగాసస్’ పై, ‘ఉపా’ నల్లచట్టాల అరెస్టుల మీద ఎంతో సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేశాయి. ఆకలి, నిరుద్యోగం, ప్రైవేటీకరణ, పలు కుంభకోణాలను కూడా వెలికి తీసిన ఉదంతాలున్నాయి.
ఈ నేపథ్యంలోనే కొందరు ఈ యూట్యూబ్ ఛానళ్లను దుర్వినియోగం చేస్తున్నారు. సంచలనం కోసం లేనిది ఉన్నట్లు చెప్పడం, ఉన్నది లేనట్లు చూయించడం చేస్తున్నారు. ఒక మహిళ, ప్రజా ప్రతినిధి ఎమ్మెల్సీ అని చూడకుండా ‘తైతక్క’ అనటం తీవ్ర అభ్యంతరకరం. ముఖ్యమంత్రిని కూడా ఇదే తీరులో వ్యంగ్యంగా మాట్లాడటం ఎంతమాత్రం సబబు కాదు.
విమర్శ, ఆరోపణ ఏదైనా ఉంటే చేయవచ్చు. కానీ ఎబ్బెట్టుగా వ్యంగ్య మాటలతో విమర్శ చేయాల్సిన అవసరం ఏముంది? ఇదెక్కడి జర్నలిజం? రాజకీయ పార్టీ లో చేరి ఇంకా నేను జర్నలిస్టునే అంటే ఎట్లా! జర్నలిస్ట్ అనేవాడికి కొన్ని నియమాలు, పరిధులు ఉంటాయి. ఇష్టం వచ్చినట్లు చెబుతాం, మాట్లాడుతుంటాం, మమ్మ ల్ని ఎవరూ ఏమీ అనొద్దు అంటే ఎట్లా? విచ్చలవిడి తనాన్ని భాషను సమాజం గమనిస్తున్నది. ఎంతటి వారైనా ప్రజలకు జవాబు దారీగా ఉండక తప్పదు.
తెలంగాణలో ప్రజల సమస్యల మీద నిజాయితీగా ఫోకస్ పెడుతూ ఇబ్బందుల పాలవుతున్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ‘ప్రశ్నించే మీడియా సమాజానికి అవసరం, అనివార్యం’ అని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైనా నోరు జారకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఒక వేలు మనం ఇతరుల వైపు చూపితే.. మరో నాలుగు వేళ్ళు మన వైపు చూపుతాయి.. అందుకే ‘జర సోచ్ కే దేఖ్కర్ బోలో భాయ్’!
ఎండీ. మునీర్, 99518 65223
(వ్యాసకర్త: జర్నలిస్ట్)