15.6.2021
‘హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగ స్పందించి అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. ఈ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే నా కల సాకారమవుతుంది’
4.12.2021
ఐఏఎంసీ ప్రతిపాదన చేయగానే సీఎం కేసీఆర్ స్పందించిన తీరు ముదావహం. యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం చొరవ వల్లనే ఇది సాధ్యమైంది’
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆరు దేశాల్లో మాత్రమే ఉన్నాయి. 7వ సెంటర్ మన దేశంలోనే గాక యావత్ దక్షిణాసియాలోనే తొలిసారిగా హైదరాబాద్లో ఏర్పాటైంది. అది కూడా కేవలం ఆరు నెలల వ్యవధిలో. సీజేఐ జూన్లో ఈ ప్రతిపాదన తీసుకొస్తే.. డిసెంబర్లో సాకారమైంది. ఈ నెల 18న ప్రారంభం కానున్నది. ప్రతిష్ఠాత్మకమైన ఒక అంతర్జాతీయ సంస్థ ఇంత తక్కువ వ్యవధిలో ఏర్పాటు కావడం వెనుక సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం కృషి అసాధారణమైనది.
ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రతిపాదన వస్తే దానిని కార్యరూపంలో పెట్టడానికి ఎంతలేదన్నా ఒకటి రెండేండ్ల సమయం పడుతుంది. ప్రపంచంలో కేవలం ఆరు దేశాల్లో మాత్రమే ఉన్నటువంటి సంస్థలను ఆ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయాలంటే మరింత వ్యవధి అవసరమవుతుంది. కానీ, హైదరాబాద్లో ‘ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియా సెంటర్’ (ఐఏఎంసీ) ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరు, తీసుకున్న చర్యలు ఈ సాధారణ సూత్రాల్ని పక్కకు నెట్టేశాయి.
హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియా సెంటర్ను (అంతర్జాతీయ మధ్యవర్తిత్వ, మీడియా కేంద్రం) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ ఈ ఏడాది జూన్ 15న చేశారు. సీజేఐగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ సీఎం కేసీఆర్కు ఆర్బిట్రేషన్ సెంటర్ గురించి ప్రతిపాదన చేశారు. సింగపూర్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఏఎంసీ ఉండాలని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సమీపంలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో శాశ్వత భవనాలు కూడా నిర్మాణం చేయాలని కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ తక్షణమే సమ్మతి తెలిపారు. అంతర్జాతీయ స్థాయి సంస్థ ఐఏఎంసీని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామంటే ఎందుకు కాదంటామని, మీకు ఏం కావాలో, మా ప్రభుత్వం ఏం చేయాలో చెబితే వాటన్నింటినీ సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దీనిపై సీజేఐ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదే నెల లో సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది. ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నేతృత్వంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావులను ఢిల్లీకి పంపింది. ఇది జరిగిన 50వ రోజుకే అంటే ఆగస్టు 20న ఐఏఎంసీ ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కూడా హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
ప్రణాళికాబద్ధంగా కృషి
ఎంతో ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇంత వేగంగా ఇది సాధ్యమైంది. ఐఏఎంసీ ఏర్పాటు విషయంలో సంప్రదింపులకు, వేగంగా చర్యలు తీసుకోవటానికి వీలుగా బాధ్యతలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిలకు సీఎం కేసీఆర్ అంతకుముందే అప్పగించారు. సుప్రీంకోర్టు నుంచి, రాష్ట్ర హైకోర్టు నుంచి ఏ విధమైన ప్రతిపాదనలు వచ్చినా వెంటనే స్పందించేలా వారిద్దరూ చర్యలు తీసుకున్నారు.
మరోవైపు, హైదరాబాద్లో ఐఏఎంసీ ఏర్పాటుకు సంబంధించి జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆర్బిట్రేషన్కు పేరుగాంచిన సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ మీనన్తో ఫోన్లో మాట్లాడి హైదరాబాద్లో ఐఏఎంసీ ఏర్పాటుకు సంపూర్ణ సహకారం కావాలని కోరారు. బ్రిటన్ ఆర్బిట్రేషన్ సెంటర్తో కూడా చర్చలు జరిపారు. అంతర్జాతీయస్థాయి సెంటర్ ఏర్పాటు చేయాలంటే అదే స్థాయిలో పేరున్న ఆర్బిట్రేటర్లు అవసరం కాబట్టి, అలాంటి వ్యక్తులను హైదరాబాద్ ఐఏఎంసీకి రప్పించేందుకు కృషి చేశారు.
ఐఏఎంసీ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నదని జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పలుమార్లు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఐఏఎంసీ ఏర్పాటు సాధ్యమే అయ్యేది కాదని జస్టిస్ నాగేశ్వరరావు అన్నారు. ఈ నేపథ్యంలోనే, హైదరాబాద్ ఐఏఎంసీ సింగపూర్, యూకే స్థాయిలో పనిచేస్తుందని ఐఏఎంసీ పరిచయ కార్యక్రమంలో సీజేఐ ధీమా వ్యక్తం చేశారు. ఐఏఎంసీ తాత్కాలిక ఏర్పాటుకు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న కార్యాలయం సమకూర్చుతామని, శాశ్వత నిర్మాణం కోసం పుప్పాలగూడలో స్థలం కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ఆ కార్యక్రమంలో ప్రకటించడాన్ని సీజేఐ స్వాగతించారు. సీజేఐ జరిపిన కృషికి సీఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
మరో కలికితురాయి
విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవైన హైదరాబాద్లో ప్రపంచస్థాయి ఫార్చూన్-500 కంపెనీలున్నాయి. ఇప్పుడు మన రాజధాని కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలువబోతున్నది ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియా సెంటర్. సీజేఐ ఎన్వీ రమణ ప్రతిపాదన చేసిన ఆరు నెలల్లోనే ఈ అంతర్జాతీయ సంస్థ కార్యరూపం దాల్చటం సాధారణ విషయం కాదని స్వయంగా న్యాయ నిపుణులే వ్యాఖ్యానిస్తున్నారు.
-పెమ్మరాజు శ్రీనివాస్
జస్టిస్ రవీంద్రన్ జై తెలంగాణ
ఐఏఎంసీ ఏర్పాటు, దాని డీడ్, మార్గదర్శకాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ తెలంగాణ ప్రభుత్వ సహకారం పట్ల ముగ్ధులయ్యారు. ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో ఆయన తన ప్రసంగాన్ని ‘జై తెలంగాణ’.. అంటూ ముగించారు.