ఐటీ రంగానికి అమెరికా వంటి అగ్రదేశాలు కేంద్రంగా ఉన్నప్పటికీ, భారతీయ నిపుణులు సారథ్యం వహించి ఆ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియామకం తాజా పరిణామం. దాదాపు డజను సుప్రసిద్ధ అంతర్జాతీయ కంపెనీలకు ఇప్పటికే భారతీయులు లేదా భారతీయ సంతతికి చెందిన వాళ్లు నాయకత్వం వహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్-సత్య నాదెళ్ల, గూగుల్-సుందర్ పిచాయ్, ఐబీఎం-అరవింద్ కృష్ణ, ఎడోబ్-శంతను నారాయణ్, పాల్ఆల్టో-నికేశ్ అరోరా తదితరులు ఇప్పటికే టెక్నాలజీ యవనికపై భారతీయ ప్రతిభను చాటారు. ప్రపంచ టెక్నాలజీ కేంద్రంగా ఉన్న అమెరికాలోని సిలికాన్ వ్యాలీని నడిపిస్తున్నది మనవాళ్లే.
అమెరికా దేశ జనాభాలో భారతీయ మూలాలున్న వాళ్లు ఒక్కశాతమే. అయినప్పటికీ సిలికాన్వ్యాలీలోని ఉద్యోగుల్లో ఆరుశాతం ఉన్నారు. ఇక ఆ దేశంలో అగ్రశ్రేణి కంపెనీల సీఈవోలు దాదాపు 290 మంది ఉంటే వారిలో 67 మంది భారతీయ అమెరికన్లే. ఇందుకు కారణం మన దేశ మూలాల్లోనే ఉందని చెప్పవచ్చు. విభిన్న మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాల వంటి వైవిధ్యం నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులకైనా సర్దుబాటు చేసుకునే మనస్తత్వం మనవారిలో ఏర్పడుతుంది. కుటుంబ విలువల కారణంగా భిన్నాభిప్రాయాలను వినే సహనం, సమష్టితత్వం అలవడుతాయి. ఈ విధమైన ‘శిక్షణ’ పొందటం వల్లనే ప్రతిభావంతులకు పట్టంగట్టే అమెరికాలో భారతీయులు దూసుకుపోతున్నారని పలువురు నిపుణులు చెబుతున్నారు.
భారతీయ అమెరికన్లు సారథ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయా సంస్థల పని సంస్కృతిలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ నాయకత్వ స్థానంలో బిల్గేట్స్ ఉన్నప్పటి కన్నా సత్య నాదెళ్ల పగ్గాలు చేపట్టిన తర్వాత పని సంస్కృతి మెరుగుపడిందని, ఆదాయమూ పెరిగిందని సర్వేలలో తేలింది. సుందర్ పిచాయ్ సారథ్యం చేపట్టిన తరువాత గూగుల్ కూడా పలు విజయాల్ని నమోదు చేసింది. అయితే ఇంతటి ప్రతిభావంతుల మేధస్సును స్వదేశం ఉపయోగించుకోలేకపోవటం, వారికి తగిన అవకాశాల్ని సృష్టించలేకపోవటం మన వ్యవస్థ వైఫల్యమే. స్టార్టప్ల యుగంలో ఈ కొరత కొంత తీరుతుండటం ఉపశమనం కలిగిస్తున్నది. భారతీయ నిపుణులు సొంత దేశంలోనూ అద్భుతాలను సృష్టించగలరని అనేక స్టార్టప్లు నిరూపిస్తున్నాయి. తెలంగాణలో టీహబ్ వంటి వేదికలు పలు స్టార్టప్లకు పురుడుపోశాయి. తద్వారా మన బిడ్డల శక్తిసామర్థ్యాలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంలో ఇతర రాష్ర్టాలకు తెలంగాణ మార్గదర్శకంగా నిలిచింది. జాతీయస్థాయిలో పరిస్థితిని మరింత మెరుగుపర్చాలి. మేధోవలసను అరికట్టి దేశ సౌభాగ్యానికి టెకీల ప్రతిభను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి.