దేశ ఆహార భద్రతకు, భారత రైతాంగ భవితవ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమించే మూడు సాగు చట్టాలను రద్దుచేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఆహ్వానించదగినదే. ఇది దేశ వ్యవసాయ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న రైతాంగ విజయం. ఆ చట్టాలతో రైతులకు కలిగే విఘాతాలపై పూర్తి అవగాహన కలిగి కేంద్ర పాలకులకు తెలియజెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయం. కేంద్రం బలవంతంగా పార్లమెంటులో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలతో రైతులకు ఒనగూడే ప్రయోజనాల కంటే ‘కార్పొరేట్ల’కు కలిగే లబ్ధి ఎక్కువ.
మొదటి చట్టం ప్రకారం.. రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ బౌండరీలను దాటి ఎక్కడైనా తమ ఉత్పత్తులను స్వేచ్ఛగా, గిట్టుబాటు ధరలకు అమ్ముకోవచ్చని కేంద్రం చెప్తున్నది. అసలు దీని మర్మం వేరు. మరో లా చెప్పాలంటే కార్పొరేట్ సంస్థలకు ఎక్కడైనా దేశంలో రైతుల నుంచి ఉత్పత్తులు తమకు లాభం వచ్చేలా సేకరించేందుకు ఉపకరించే చట్టమిది. ఏఎస్సీలలో చట్టబద్ధంగా ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలను కార్పొరేట్లు చెల్లించి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ప్రభుత్వం అజమాయిషీ కానీ, ప్రభుత్వానికి గానీ కోర్టులకు కానీ జవాబు చెప్పాల్సిన అవస రం లేకుండా ‘కార్పొరేట్’ సంస్థలకు ఈ చట్టం రాజ్యాంగబద్ధంగా, దోపిడీకి అవకాశం కల్పిస్తుంది.
ఇక రెండో చట్టం.. కాంట్రాక్ట్ ఫార్మింగ్కు రహదారులు వేసే చట్టం. ఇదీ వ్యవసాయ కార్పొరేటీకరణకు ఊతమిచ్చేదే. ఒప్పంద సాగు విఫల ప్రయోగం. కేంద్రం రాజ్యాంగబద్ధంగా ప్రకటిస్తున్న, రాష్ర్టాలు అమలుపరుస్తున్న మద్ధతు ధరలే రైతులకు అందని రోజుల్లో.., కార్పొరేట్ కంపెనీలతో రైతులు ఒప్పందం చేసుకొని గిట్టుబాటు ధర పొందే అవకాశాలు గానీ, అటువంటి సక్సెస్ మోడల్లు కానీ ఇప్పటివరకు లేనే లేవు. గుజరాత్లో ఆలుగడ్డ సాగు చేసిన రైతులపై కంపెనీలు కేసులు పెట్టిన ఉదంతం కాంట్రాక్ట్ ఫార్మింగ్ లోనిదే. పూర్థిస్థాయిలో రైతులను కార్పొరేట్ల కబంధ హస్తాల్లోకి తోసేదే- ‘నిత్యావసర సరుకుల సవరణ చట్టం’. ప్రపంచంలో ఏ దేశం లో లేని గొప్ప వ్యవస్థలు మన దేశంలో ఉన్నాయి. అవే కనీస మద్దతు ధరలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రజా పంపిణీ వ్యవస్థలు. ఈ మూడు వ్యవస్థలే దేశంలో రైతులు, వినియోగదారులు, చివరికి దేశానికి కూడా మేలు చేసేవి. సరసమైన ధరలకు పేదలకు ఆహార ధాన్యాలు అందించేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ ఉన్నది. ఇందుకు అవసరమైన ఆహార ధాన్యాలను ఎఫ్సీఐ తీసుకుంటుంది. కనీస మద్దతు ధరలు ఇచ్చి రైతుల నుంచి ధాన్యం సేకరిస్తుంది. ఈ మూడు వ్యవస్థలు దేశానికి వెన్నెముకలు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్సీఐని ఎత్తేసే ఆలోచనతో శాంతకుమార్ కమిటీని నియమించింది. వీటి వ్యవస్థలో లోపాలున్నాయని, ఎఫ్సీఐ, పీడీఎస్లను రద్దుచేయాలని సైతం ఆ కమిటీ సిఫారసు చేసిన ఆనవాళ్లున్నాయి!
పంటల సరళి మారాలి. చిన్న రైతులకు ప్రయోజనం చేకూరాలి. మద్దతు ధరలను పారదర్శకంగా, సమర్థవంతంగా అమలుపరిచేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం అనటం ఆహ్వానించదగినదే. అయితే అందులో రాష్ర్టాల అభిప్రాయానికి పెద్దపీట వేయాలి. రైతు సంక్షేమ పథకాలు, రైతు అనుకూల విధాన నిర్ణయాలు అమలుచేస్తున్న తెలంగాణ రాష్ట్రం వంటి వాటి సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ర్టాలవారీగా పంటల ఉత్పత్తి ఖర్చులలో భారీ వ్యత్యాసాలున్న నేపథ్యంలో రాష్ర్టాల వారీగా పంటల మద్దతు ధరలు నిర్ణయించాలి. లేదా వ్యత్యాసాన్ని చెల్లించే అధికారాన్ని రాష్ర్టాలకు ఇవ్వాలి. దేశవ్యాప్తంగా మిగులు పంటల ఎగుమతులకు మెరుగైన చట్టాన్ని రూపొందించాలి. అప్పుడే దేశంలో రైతుకు ప్రభుత్వాల మద్దతున్నట్లు లెక్క.
డాక్టర్ పిడిగెం సైదయ్య, 77805 09322
(వ్యాసకర్త: అసోసియేట్ ప్రొఫెసర్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం)