ఈ మధ్య ప్రధాని మోదీ కార్పొరేట్లు, ఫైనాన్స్ పెట్టుబడిదారులను సంపద సృష్టికర్తలని ప్రశంసించారు! మోదీ గారూ.. దేశంలోని కార్పొరేట్లు, బహుళజాతి కంపెనీ యజమానులు తమ ధనమంతా ఒకేచోట కుమ్మరించి దానిచుట్టూ వాళ్ళను కూర్చోబెట్టండి! అన్నదాతలు పండించిన అన్నాన్ని ముట్టకుండా, కష్టజీవులను పిలవకుండా, వాళ్ళు బతకగలిగినా, అక్కడున్న ధనం కన్నా అదనంగా ఒక్క రూపాయిని సృష్టించగలిగినా.. మీరన్నట్లు సంపద సృష్టికర్తలుగా వాళ్ళను పూజిద్దాం! ఇప్పటికైనా ‘దేశమంటే కార్పొరేట్లు కాదు, అన్నదాతలు కష్టజీవుల’న్న వాస్తవాన్ని గుర్తించండి! అభివృద్ధి అంటే ‘కార్పొరేట్లను ప్రపంచ కుబేరులుగా ఎదగట’మన్న దాన్నుంచి బయటపడి, ‘దేశ ప్రజలందరికీ రోటీ-కపడా-మకాన్-విద్య-వైద్యాలకు భద్రతను, భరోసాను కల్పించటం’ అన్న వాస్తంలోకి రండి మోదీజీ!
‘ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు! చెడును నిలదీయకుండా చేతులు కట్టుకున్న మంచివాళ్ళ వల్ల-చెడును ప్రశ్నించలేని భయస్థుల వల్ల, మనకెందుకు లెమ్మనుకొనే స్వార్థపరుల వల్ల చెడిపోతున్నది’ అన్నాడు మన మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలామ్. భారత ప్రజలందరి ఆహార భద్ర త కోసం కొనసాగుతున్న ఈ ఉద్యమాన్ని విజయతీరానికి చేర్చుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయునిది.
ప్రపంచ వ్యవసాయాధారిత దేశాలలో అత్యధిక జనాభా కల్గినవి చైనా, భారత్. అయితే అమెరికా, ఐరోపా సంపన్న దేశాలల్లో ఉత్పత్తి అయి మిగిలిపోతున్న వాళ్ళ ఆహార ధాన్యాలను లాభదాయకంగా అమ్ముకోవటానికి అతిపెద్ద మార్కెట్ భారతదేశమే! కానీ మన ధాన్యాన్ని మనమే పండించుకోగల్గినంత కాలం వాళ్ళకా అవకాశం దక్కదు. అందుకోసం భారత రైతులను ఆహార ధాన్యాలను పండించటానికి భయపడేలా చేయాలి! అందుకనే.. 1.ధాన్యం మద్దతు ధరను చట్టబద్ధం చేయరాదు. 2.ప్రభుత్వం ధాన్య సేకరణ చేయరాదు. 3.వ్యవసాయ సబ్సిడీలను, సబ్సిడీల ప్రజా పంపిణీలను ఎత్తివేయాలి.4.వ్యవసాయ ఉత్పత్తుల మార్కె ట్ కమిటీలను మూసేయాలి. 5.రైతుకు రక్షణ కల్పించే ఇప్పుడున్న చట్టాలకు బదులు, వ్యవసాయాన్ని మార్కెట్ శక్తులకు అప్పగించే కొత్త చట్టాలను చేయాలి.. అంటూ సంపన్నదేశాలు ఒత్తిడి చేస్తున్నాయి.
1965-67 మధ్య పంటలు దెబ్బతిని, బీహార్ వంటి పెద్ద రాష్ర్టాల్లో కరువు విలయ తాండవం చేసింది. ఈ నేపథ్యంలోంచే భారత్లో ‘హరిత విప్లవం ప్రారంభమైంది! అన్నదాతలను అన్నివిధాలా ప్రోత్సహిస్తూ దేశానికి ఆహార ధాన్యాల స్వయం సమృద్ధిని, ఆహార భద్రతను సాధించగలిగారు. ఆ తర్వాత కాలంలో సదరు దేశాల ఒత్తిడి మేరకు వ్యవసాయ సబ్సిడీలను కొంత తగ్గించుకొంటూ వచ్చారే తప్ప, రైతు రక్షణకు, ఆహార భద్రతకు తోడ్పడే చట్టాలకు తూట్లు పొడవలేదు. కానీ ‘అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్’గా చెప్పుకొంటున్న మీరు సంపన్న దేశాల కు, కార్పొరేట్లకు ఇంతగా లొంగిపోయారేంటి మోదీజీ? భారతదేశ ఆహారభద్రతను, అగ్రరాజ్యాల దయాదాక్షిణ్యాలకు వదిలేసే వ్యవసాయచట్టాలనెలా చేశారు మోదీ!
మోదీజీ.. మీరు గుర్తుంచుకోవలసిన సత్యం ఏమంటే.. భారత్ను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవటానికి, మన చేత ఆహారధాన్యాల ఉత్పత్తిని మాన్పించి, వాళ్ళు అమ్మితే తప్ప ఆకలి తీర్చుకోలేని దుస్థితికి, భారత్ను నెట్టే యాలన్నదే కార్పొరేట్ల ఆంతర్యం! ఈ ప్రమాదాన్ని నాటి రైతులు వ్యవసాయ కూలీలు పసిగట్టారు. నేడు కూడా కుల, మత, లింగ, మతాలకు అతీతంగా కరోనా సంక్షోభంలో మీరు రూపొందించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ‘జై భారత్! జై కిసాన్!’ అంటూ సమైక్యంగా ఉద్యమిస్తున్నా రు! రైతు పంటకు మార్కెటింగ్ చట్టం, వ్యవసాయోత్పత్తులు, పంపిణీల ఒప్పంద చట్టం, నిత్యావసర సరుకుల సరఫరా చట్టం, విద్యుత్ సంస్కరణల చట్టం వంటి వాటిని ఉపసంహరించుకోవాలనీ, రైతుకు మద్దతు ధరను చట్టబద్ధ హక్కుగా రూపొందించాలన్న డిమాండ్లతో రైతులు ఏడాది కాలంగా పోరాడుతున్నారు.
ఈ ప్రమాదకర చట్టాలను నిరసిస్తూ, ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ‘భారతీయ కిసాన్ సభ’తో సహా, దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాల మద్దతుతో కొనసాగుతున్నది. ఈ నెల 26 నాటికి ఏడాది పూర్తికానున్న ఈ ఉద్యమంలో ఇప్పటికి వందలమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. లఖింపూర్వద్ద కేంద్ర మంత్రి కొడుకు కారుతో తొక్కించి చంపిన నలుగురు రైతుల చితాభస్మాన్ని దేశంలోని ప్రధాన నదలన్నింటా నిమజ్జనం చేశారు! ఇంత జరిగినా కనీసం సంతాపం కూడా తెలియజేయక పోవటం, రైతులను పరామర్శించక పోవటం గర్హనీయం.
రాష్ట్ర పరిధిలోని వ్యవసాయ చట్టాలను రాష్ర్టాలతో చర్చించకుండా రూపొందించట అప్రజాస్వామికం. కనుక ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలతో తీర్మానాలు చేయవలసిందిగా రాష్ర్టాధినేతలను కూడా అభ్యర్థిస్తున్నారు రైతు నేతలు. ఆ చట్టాలను అంగీకరించటమంటే మన దేశ ఆహార భద్రతను, సంపన్న దేశాల దయాదాక్షిణ్యాలకు వదిలేసినట్లే! అందుకే ఈ చట్టాల ఉప సంహరణ-రైతు మద్దతు ధరకు చట్టబద్ధీకరణలే సరైన పరిష్కార మార్గం.
‘ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు! చెడును నిలదీయకుండా చేతులు కట్టుకున్న మంచివాళ్ళ వల్ల-చెడును ప్రశ్నించలేని భయస్థుల వల్ల, మనకెందుకు లెమ్మనుకొనే స్వార్థపరుల వల్ల చెడిపోతున్నది’ అన్నాడు మన మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలామ్. భారత ప్రజలందరి ఆహార భద్ర త కోసం కొనసాగుతున్న ఈ ఉద్యమాన్ని విజయతీరానికి చేర్చుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయునిది. అందుకే ‘కిసాన్ బచావో’-‘భారత్ బచావో’ జై భారత్! జై కిసాన్ అని నినదిస్తూ ఉద్యమాన్ని విజయతీరానికి చేరుద్దాం!
పాతూరి వెంకటేశ్వరరావు
98490 81889