కలిసి భోంచేద్దాం కానీ.. అరిటాకు నాది, చింతాకు నీది అన్నట్లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. పన్నుల రాబడినంతా కాజేస్తూ, రాష్ర్టాలను సర్దుకుపోండని చెప్తున్నది. ఆదాయం కోసమై నెనరు లేకుండా ప్రజలపై ధరల భారం మోపుతున్నది. కరోనా దెబ్బకు జనం ఉద్యోగాలు కోల్పోయి, వ్యాపారాలు దెబ్బతిని విలవిలలాడుతున్నా పెట్రోల్, డీజిల్ ధరలను మోదీ సర్కార్ యథేచ్ఛగా పెంచుతూ వచ్చింది. ఇన్నాళ్లుగా కొండంత భారం మోపి, ఇప్పుడు గోరంత తగ్గించి అదే దీపావళి కానుక అని చెప్పటం జనం మీద విసిరిన క్రూరమైన జోక్గా భావించాలి. అంతేకాక రాష్ట్రప్రభుత్వాలు కూడా పెట్రో ధరలు తగ్గించాలనటం కేంద్రం తెంపరితనానికి నిదర్శనం.
‘పెంచింది ఎవరు? వచ్చిన సొమ్ముతో బొక్కసాన్ని నింపుకొన్నదెవరు’ అన్నదాన్ని బట్టి తగ్గించే బాధ్యత ఎవరిదన్నది తేటతెల్లమవుతుంది. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి మే 2014లో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 109 డాలర్లు కాగా, దేశంలో లీటరు పెట్రోల్ రూ.72, డీజిల్ రూ.55 ఉండేది. ప్రస్తుతం ముడిచమురు ధర 83 డాలర్లకు తగ్గినా.. పెట్రోల్, డీజిల్ ధరలు వంద దాటిన దుస్థితి. ఈ ఏడేండ్లలో బ్యారెల్ ముడిచమురు ధర కనిష్ఠంగా 37 డాలర్లకు కూడా పడిపోయింది. ఇంత తగ్గినా కూడా కేంద్రం చమురు ధరలు తగ్గించకపోగా పెంచుతూ పోయింది. అది కూడా రాష్ర్టాలకు ఎక్కడ పంచి ఇవ్వాల్సి వస్తుందోనని పన్ను రూపంలో కాకుండా సెస్సు రూపంలో పెంచింది. తద్వారా రాష్ర్టాలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన వాటా ఇవ్వకుండా మొత్తం పెంపును ఖజానాలో నింపుకొన్నది. పెట్రోల్ మీద రూ.40 వరకూ పెంచి రూ.5, డీజిల్ మీద రూ.50 పెంచి రూ.10 తగ్గించటం ఒక తగ్గింపా? పైగా రాష్ర్టాలకు సుద్దులు చెప్పటమా?
చమురు మీద రాష్ట్రప్రభుత్వం విధిస్తున్న వ్యాట్పై గత ఆరేండ్లలో నయాపైసా పెంచలేదని, కాబట్టి, తాము ఎందుకు తగ్గించాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని వేసిన ప్రశ్న న్యాయమైనది. కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే విచక్షణారహితంగా పెంచిన సెస్సును ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలి. కానీ, కేంద్రసర్కార్లో ఆ భావన ఉన్నట్లు కనిపించటం లేదు. ఇటీవలి స్వల్పతగ్గింపు కూడా దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీని పలుచోట్ల ఓడించటం, త్వరలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు వంటి కఠిన పరీక్షను ఎదుర్కోవాల్సి ఉండటం వల్లనే అనేది బహిరంగ రహస్యం. దిశానిర్దేశం చేయాల్సిన కేంద్రం ప్రతి అంశాన్నీ రాజకీయకోణంలో చూడటం దేశానికి మంచిది కాదు. అడ్డూఅదుపూ లేకుండా పెట్రో ధరలు, తద్వారా నిత్యావసరాల ధరలు పెరిగిపోతే అది ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదమున్నదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేంద్రం ఈ మాటలను ఇప్పటికైనా చెవినపెట్టాలి. ఏకపక్ష వైఖరిని మానుకొని రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి.