ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వానికైనా మొదటి కర్తవ్యం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడం. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల అలుపెరుగని పోరాటంలో తల్లి పాత్రను టీఆర్ఎస్ పోషించి, స్వరాష్ర్టాన్ని సాధించింది. అనేకానేక సామాజిక రంగాల్లో తీవ్రమైన వివక్షకు గురై అత్యంత ప్రజాస్వామికమైన ఆకాంక్షతో మొదలైన ఉద్యమంలో వ్యాన్ గార్డ్ పాత్ర పోషించింది. కాబట్టే ప్రభుత్వం ఏర్పడగానే ప్రజల మౌలిక అవసరాలను తీర్చడం కోసం, సాధికారత సాధించడం కోసం టీఆర్ఎస్ నడుం బిగించింది.
రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రధాన రంగాలను గుర్తించి ఆయా సామాజికవర్గాల అభ్యున్నతి కోసం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. పల్లె నుంచి పట్టణం దాకా.. ప్రతి కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలను సమగ్రంగా తెలుసుకోవడం కోసం చారిత్రాత్మకంగా ‘సమగ్ర కుటుంబ సర్వే’ చేపట్టింది. సేకరించిన సమాచారం ఆధారంగా తెలంగాణ ప్రజల మౌలిక అవసరాలను తీర్చే కార్యక్రమాలను రూపొందించింది. రాష్ట్ర పునర్నిర్మాణంలో విజయవంతమైన ప్రభుత్వంగా ప్రజలే స్వయంగా గుర్తించారు కనుకనే టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సంక్షేమ యజ్ఞాన్ని మలివిడత పాలనలో కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఆ క్రమంలో వచ్చిందే ‘దళిత బంధు’ పథకం. దాని నేపథ్యాన్ని చారిత్రకంగా అర్థం చేసుకోకుండా, రాజకీయ లబ్ధి కోసం విపక్ష పార్టీలు అవాకులు, చెవాకులు పేలుతున్నాయి. విద్యావంతులుగా, బుద్ధిజీవులుగా దళితబంధు పథకం దళిత సాధికరత కోసం ఎంతటి క్రియాశీలమైన పాత్ర పోషిస్తుందో అర్థం చేసుకోవడం, ప్రజలందరికీ అర్థం చేయించడం సామాజిక బాధ్యతగా భావించాలి. అంతేకానీ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే ‘దళితబంధు’ పథకాన్ని ప్రారంభిస్తున్నారని ప్రతిపక్షాలు విషప్రచారం చేయడం విషాదం.
కంచంలో అన్నం, అది పండించే రైతు ఉండాలంటే, ఆ రైతు కాళ్లు పొలం వైపు మళ్లాలంటే చేతిలో పెట్టుబడి ఉండాలి. అందుకే రైతు బాంధవుడిగా కేసీఆర్ ‘రైతు బంధు’, ‘రైతు భీమా’ పథకాలను ప్రారంభించారు. ఆ క్రమంలోనే ‘రైతుబంధు’ పథకాన్ని హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. అప్పుడేమన్నా హుజూరాబాద్ ఉప ఎన్నికలున్నాయా! నాడు ఏ స్వార్థంతో ఈ ప్రతిష్ఠాత్మక పథకాలు ప్రారంభించారు! ఏనాడూ ప్రజాసంక్షేమం ఊసెత్తని పార్టీలు ఇవాళ ‘దళిత బంధు’ పథకాన్ని హుజూరాబాద్ నుంచి ప్రారంభిస్తే ఎన్నికల స్వార్థం అనటం విడ్డూరం.
కులం, జెండర్, ఆర్థికం తదితర పేర్లతో వివక్షకు గురిచేసి ప్రతిభావంతులను ఉత్పత్తి రంగానికి దూరంగా చేయడం సామాజిక ద్రోహమే. ఇది వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగానే కాకుండా జాతికే నష్టం కలిగిస్తుందని ఆలోచించి, దళిత బాంధవుడిగా వారి అభ్యున్నతికోసం తలపెట్టిన ‘దళిత బంధు’ పథకాన్ని విమర్శించేవారు ఎవరైనా దళితుల అభ్యున్నతికి వ్యతిరేకులే. ఇంకా చెప్పాలంటే దళిత ద్రోహులు.
తరతరాల వివక్ష, అణచివేతల నుంచి దళితులను విముక్తి చేయటం కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాడారు. అంబేద్కర్ ఆశయాలకు ఆచరణాత్మక రూపమిస్తున్నవారు అభినవ అంబేద్కర్ కేసీఆర్. ఇది తెలంగాణలోని ప్రతి దళిత గుండెకు తెలుసు. ఇది గుర్తించిన కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించి అమలుచేస్తున్నారు. నిజానికి కేసీఆర్ వ్యక్తి కాదు. తెలంగాణ బతుకు పునర్నిర్మాణ బావుటా. ఆ బావుటాను తెలంగాణ ప్రజలు గుండెల్లో దాచుకుంటారు.
వేల్పుకొండ వెంకటేశ్