‘ఆప్ చార్ తారీఖ్కో ఓట్ కర్నే జాయ్.. తో జరా ఘర్ మే గ్యాస్ సిలిండర్ హైనా.. ఉస్ కో జరా నమస్కార్ కర్కే జాయియే’.. మన్మోహన్సింగ్ హయాంలో వంటగ్యాస్ ధరలు పెరగటంపై గతంలో ఎన్నికల సభల్లో నరేంద్రమోదీ విసిరిన వ్యంగ్యోక్తి ఇది. ఓటర్లు ఆయన చెప్పినట్లుగా గ్యాస్ సిలిండర్కు నమస్కారం చేశారో లేదో తెలియదు గానీ మోదీ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఐదేండ్లకు మరోమారు ప్రధాని పీఠాన్ని చేపట్టారు. కానీ గ్యాస్ సిలిండర్ మీద బాదుడు ఆగలేదు సరికదా.. మరింత తీవ్రతరమైంది. 2014లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.410 కాగా.. ఇప్పుడది రూ.952కు చేరుకున్నది. ఏడేండ్లలో ఒక్కో సిలిండర్పై మోదీ సర్కార్ మోపిన భారం అక్షరాలా 542 రూపాయలు. గడిచిన ఒక్క ఏడాదిలో పెరిగిన మొత్తం రూ.306.
నిరుపేద మహిళల కోసం 2016లో కేంద్రం ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ అనే పథకం ప్రారంభించి ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లను, గ్యాస్స్టవ్లను అందజేసింది. కానీ ధరాభారంతో ఇప్పుడు అనేకమంది లబ్ధిదారులు ఖాళీ సిలిండర్ను రీఫిల్ చేయించుకోలేక తుక్కు సామాను కింద అమ్ముకుని, మళ్లీ కట్టెల పొయ్యి మీద, కుంపట్ల మీద వంట చేసుకుంటున్నారు. బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్లోని ఓ తుక్కు కంపెనీలో ఖాళీ సిలిండర్లు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావటం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నది. వంట గ్యాస్ను చౌకగా అందుబాటులోకి తేవడం అంటే అది పేదలకే కాదు, పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతుంది. మోదీ ప్రభుత్వ ధరల పెంపు సమాజంపైనా, పర్యావరణంపైనా భారం మోపేదిగా ఉన్నది.
సిలిండర్ ధర వెయ్యికి చేరువవుతుంటే, పెట్రోల్, డీజిల్ ధరలు వంద దాటాయి. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి మే 2014లో దేశంలో లీటరు పెట్రోల్ రూ.72, డీజిల్ రూ.55 కాగా నాడు బ్యారెల్ ముడిచమురు ధర 109 డాలర్లు. ప్రస్తుతం ముడిచమురు ధర 83 డాలర్లకు తగ్గిపోగా.. పెట్రోల్ రూ.112, డీజిల్ రూ.105. ఏమిటీ మాయ? మోదీ అధికారం చేపట్టిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గాయి. కానీ, ప్రభుత్వం ఆ తగ్గుదల ప్రజలకు చేరకుండా, చమురుపై పన్నులు పెంచి ఖజానా నింపుకొన్నది. ఈ ఏడేండ్లలో ఇంధనం మీద కేంద్రం రూ.24 లక్షల కోట్ల ఆదాయాన్ని మూటగట్టుకున్నది. ఒకప్పుడు పెట్రోల్, గ్యాస్తో పేదలకు అవసరం ఉండకపోయేది. ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగితే పేద, ధనిక తేడా లేకుండా అందరిపై ప్రత్యక్ష, పరోక్ష భారం పడుతుంది. ఆర్థిక వ్యవస్థ ఎన్నో రూపాలకు విస్తరించిన నేపథ్యంలో ప్రభుత్వాలు ఇంకా పెట్రోలు వడ్డనపైనే ఎక్కువగా ఆధారపడటం అవసరమా? పెట్రోల్ ధరల పెంపు ద్రవ్యోల్బణానికి దారితీసి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా ప్రజలపై భారం పడని రీతిలో, ఇతరేతర వినూత్న మార్గాలలో ఆదాయం పెంచుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించాలి.