తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి రాష్ట్రప్రభుత్వం కొత్త దారులు వేసింది. సమకాలీన స్పృహను, సామాజిక పరిణామాలను, వినూత్న సాహిత్య పోకడలను అర్థం చేసుకొని వర్తమాన అవసరాలకనుగుణంగా పాఠ్యప్రణాళికను రూపొందించే విద్యాసంస్కరణకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొదటిసారిగా డిగ్రీ తృతీయ సం. పాఠ్యపుస్తకాన్ని ‘సాహితీదుందుభి’ పేరుతో పాఠ్యప్రణాళిక సంఘం రూపొందించింది.‘పాఠ్యపుస్తకం సృజన వేదికగా ఉపయోగపడుతూనే విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి మార్గాలను చూపాలనే’ ధ్యేయంతో సంపాదకులు ఈ పాఠ్యాంశాలను రూపకల్పన చేశారు. వివిధ సాహిత్య ప్రక్రియల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించటం, ఆయా ప్రక్రియల్లో రచనలు చేయడానికి అవసరమైన సృజనాత్మక స్ఫూర్తిని కలిగించేవిధంగా సాహితీ దుందుభిలోని పాఠ్యభాగాలున్నాయి.
భాషా సాహిత్యాలతో పాటు గ్రంథ అధ్యయనాన్ని ఒక సంస్కృతిగా, నిరంతర కార్యంగా భావించాలని ఈ పాఠ్యపుస్తకం ప్రభోధిస్తుంది. పుస్తకసమీక్ష, జీవిత చరిత్ర, ఉపన్యాస కళ, జర్నలిజం మౌలికాంశాలు, ఇంటర్వ్యూ స్కిల్స్ వంటి సరికొత్త పాఠ్యాంశాలు తెలుగు వాచక వాసిని పెంచే విధంగా ఉన్నాయి. స్టడీ ప్రాజెక్ట్స్ ను రూపొందించే విధానాన్ని కూడా ఈ పుస్తకం ద్వారా విద్యార్థులకు పరిచయం చేయటం మంచి ప్రయత్నం. పోటీ పరీక్షల్లో రాణించడానికి, మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోడానికి, కవులుగా, రచయితలుగా, వక్తలుగా, పాత్రికేయులుగా స్థిరపడటానికి అవసరమయ్యే నైపుణ్యాలను పెంపొందించే విధంగా పాఠ్యాంశాలను తీర్చిదిద్దారు. ఈ పాఠ్యాంశాలను అధ్యాపకులు సృజనాత్మకంగా బోధించాలి. ఇందుకోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖతో కలిసి ప్రభుత్వ సిటీకళాశాల తెలుగు శాఖ అంతర్జాల జాతీయ కార్యశాల నిర్వహిస్తున్నది.
సృజనాత్మక బోధనా పద్ధతులపై (అంతర్జాల) కార్యశాల
డిగ్రీ తృతీయ సం॥ తెలుగు పాఠ్యగ్రంథం (సాహితీ దుందుభి) సృజనాత్మక బోధనా పద్ధతులపై నేడు, రేపు అంతర్జాల కార్యశాల జరుగుతుంది. సిటీ కాలేజీ ఆవరణలో డాక్టర్ పి.బాల భాస్కర్ అధ్యక్షతన జరుగు ప్రారంభ సమావేశంలో గౌరవ అతిథులుగా డాక్టర్ కె.వి.రమణాచారి, నవీన్ మిత్తల్, ఆచార్య ఆర్ లింబాద్రి హాజరవుతారు. విశిష్ట అతిథులుగా దేశపతి శ్రీనివాస్, ఆచార్య సూర్య ధనంజయ్ పాల్గొంటారు.