పెట్టుబడులను ఆకర్షిస్తూ పురోగతి సాధిస్తున్న తెలంగాణ ప్రగతిని చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓర్వలేక కుట్రలు పన్నుతున్నది. ఎదుటివాడు బాగుపడుతుంటే అతన్ని బాధ పెట్టాలనే ద్వేషపూరిత స్వభావం కొందరికి ఉంటుంది. అది వెనుకబడిన, సామాన్య మనిషిలో ఉన్నదంటే అతని అజ్ఞానమని సరిపెట్టుకోగలం. కానీ రాష్ర్టానికి పెద్దన్న వలె అండగా ఉండాల్సిన ప్రధాని మోదీ గుండెల బాకులు గుచ్చే పనులకు తెగబడుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభు త్వ తీరు చూసి తెలంగాణ ప్రజలు విస్తుపోతున్నారు. ‘మనసా నిను నిప్పుతోని కడుగనా మనసా..’ అని ఓ కవి అన్నట్టు.. ఇప్పుడు తెలంగాణ మీద అసూయతో నిండిపోయిన కేంద్ర ప్రభుత్వ మనుసును మండే కొర్రాసుతోని కడుగాలె.
ఏరుబడితే ఆగమైతరని ఎతేష్కం చేసిన కాడ బాగుపడి సూపించాలనే కసితో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్నది అప్పు కాదు, పెట్టుబడి అనే కనీస అవగాహన కేంద్రంలోని పెద్దలకు లేకపోవడం శోచనీయం. ఊడ్సుక తిని, కడుక్క తాగుతానికి, జల్సాలకు తెచ్చునేది అప్పు. పైస తెచ్చి, పైసను పుట్టించి, మెరుగైన జీవనాన్ని గుణాత్మకంగా తీర్చిదిద్దేందుకు తెచ్చే పుట్టుబడిని (అప్పును) ప్రగతి పెట్టుబడి అంటరు. ఈ తేడా తెలుసుకోకుండా ‘అప్పు.. అప్పు..’ అంటూ అరుస్తున్న మోదీ ప్రభుత్వానికి ఎవరు చెప్తే అర్థమైతదో ఏమో..?
పైస పెడితేనే పైస పుడుతదనేది ఆర్థిక సూత్రం. సామాన్య పేద మానవుని సంసారం నుంచీ, ప్రపంచంలో పెద్ద దేశం దాకా ఆర్థిక పురోగతిని పరిశీలిస్తే బోధపడే చారిత్రక సత్యం ఇది. దీన్ని ఔపోసన పట్టిండు కావట్టే.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు దేశం కనీవినీ ఎరుగని ఆర్థిక, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ నాటిన వొక్కో పైస, వొక గింజకు వందలాది గింజలను అందించిన జొన్న కంకులై ప్రగతి పంటను పండించడం షురువైంది. సమస్తరంగాల్లో గుణాత్మక మార్పు సంతరించుకుంటున్నది. ఈ ప్రగతిని అనివార్యంగా ప్రశంసించే పరిస్థితిని తెలంగాణ నేడు దేశాన్నేలే పాలకులకు కల్పించింది. కేంద్రస్థాయిలో ఏ అవార్డులు, రివార్డులు పంచే కార్యక్రమం పెట్టుకున్నా అందుల తెలంగాణదే అగ్రభాగం. ఏం జేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నరీ గుజరాతీ మోడల్ నాయకులు.
ప్రగతి ప్రస్థానంలో దూసుకుపోతున్న తెలంగాణ కాళ్లల్ల కట్టెలు పెట్టాలని ఎన్నితీర్ల జూసినా ముఖ్యమంత్రి కేంద్ర కుయుక్తులను తిప్పి కొడుతున్నరు. కరోనా దెబ్బకు దేశమంతా అల్లకల్లోలమైతున్నది. కానీ కేసీఆర్ ఎక్కడా వెరవకుండా, వెనుకడుగు వేయకుండా సముచిత నిర్ణయాలను అమలు చేస్తున్నరు. తెలంగాణను అగ్రభాగాన నడిపిస్తున్నరు. దీంతో సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి కంటగింపుగా మారిండు. అందుకే తెలంగాణ కంట్లో నలుసుల్లాగా, చెప్పులో రాయిలాగా మారే కుట్రలకు కేంద్రం ఒడిగిట్టింది. కొత్త కొత్త నిబంధనలు తెచ్చి తెలంగాణకు అడ్డం పడుతున్నరు. గడిచిన ఎనిమిదేండ్లల్లో చెప్పుకోవడానికి ఒక్క పనీ చేయని కేంద్రం లక్షల కోట్ల అప్పులు చేసింది. అడ్డగోలుగా దుబారా చేసింది.
కానీ ఆరేండ్లల్ల యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. దీనిని చూసి తట్టుకోలేని కేంద్రం పెట్టుబడి కోసం ఎక్కడ కూడా పుట్టుబడి దక్కనీయకుండా చేస్తున్నది. ఇది ఎంతటి అన్యాయం? ప్రోత్సహించాల్సింది పోయి ఈ విధంగా అడ్డుకోవటం సమంజసమేనా? తెలంగాణ ప్రజలు ఇసొంటోళ్లను చానామందినే చూసిండ్రు. కేంద్రం కుట్రలను తిప్పికొట్టి, తెలంగాణ తన ప్రగతి ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తనే ఉంటది.
– సహస్ర