చాలామంది దైనందిన జీవితాల్లో సోషల్ మీడియా ఒక భాగమైపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ వంటి వేదికలను యువత నుంచి వృద్ధుల వరకూ వినియోగిస్తున్నారు. భారతీయులు సోషల్ మీడియా మీద సగటున రోజుకు 2 గంటల 40 నిమిషాలు గడుపుతున్నారు. 18-24 ఏండ్ల వయస్సున్న యువతీ యువకులు మరింత ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కేవలం ఈ వయసు వాళ్లలోనే ఫేస్బుక్కు 9.72 కోట్ల మంది వినియోగదారులు, ఇన్స్టాగ్రామ్కు 6.9 కోట్ల మంది వినియోగదారులు భారత్లో ఉన్నారు.
సోషల్మీడియాపై అధికాధిక సమయం గడుపుతూ ప్రమాదకరమైన అంశాలను (Risky Contentను) చదువుతుండటం, చూస్తుండటం వల్ల మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన చెడు ప్రభావం పడుతున్నది. ఫలితంగా.. ఎదుటి వ్యక్తులతో వ్యవహరించే విషయంలో మార్పులు (changes in behavioural patterns), ఇతరులకన్నా తక్కువ అనే భావన పెరుగటం (inferiority), ఇతరులను వేధించటం, బెదిరించటం (cyber bullying) వంటి దుర్లక్షణాలు అలవడుతున్నాయి. దీనివల్ల ఆయావ్యక్తుల ఆరోగ్యం కూడా దెబ్బతింటున్నది.
ఇటువంటి సమస్య తీవ్రరూపం దాల్చుతున్నప్పటికీ.. దీనిపై భారతదేశంలో అవసరమైనంత చర్చ జరగటం లేదు. సమస్యపై నిర్లక్ష్యం నెలకొనటమేగాక ఆ సమస్యకే కళంకం (stigma) ఆపాదించే పరిస్థితి కూడా ఉంది. యూనిసెఫ్ ప్రకారం.. 15-24 ఏండ్ల వయసున్న భారతీయుల్లో ప్రతీ ఏడుగురిలో ఒకరు కుంగుబాటు (డిప్రెషన్)కు గురవుతున్నారు. డిప్రెషన్ వల్ల ఆత్మవిశ్వాసం లోపించటం, ఏకాగ్రత లేకపోవటం, ఇతరులతో వ్యవహరించే పద్ధతిలో, సంభాషించే విషయంలో సమస్యలు ఎదుర్కోవటం వంటివి తలెత్తుతున్నాయి. ఫలితంగా చేస్తున్న పని మీద, చదువుల మీద దృష్టి పెట్టలేకపోవటం, దుందుడుకుతనంతో కొట్లాటలకు దిగటం, ఆత్మహత్య ఆలోచనలకు గురికావటం వంటి మరింత సంక్షోభంలోకి వెళ్తున్నది యువత.
సంఘజీవులుగా మనుష్యులు సామాజిక ఆమోదాన్ని కోరుకోవటం అనువంశికంగా సంక్రమించే లక్షణం. ఇక్కడే సోషల్ మీడియా ఒక ఉపకరణంగా పనికొస్తున్నది. ఫేస్బుక్ వంటివాటిల్లో తాము పెట్టిన పోస్ట్కు, ఫొటోకు ఎన్ని లైక్లు వచ్చాయన్నది తమ మేధస్సుకు, అందానికి, మొత్తంగా ఒక మనిషిగా తమకున్న విలువకు కొలమానంగా చాలామంది భావిస్తున్నారు. తమలో తమకు నచ్చని అంశాలను దాచిపెట్టి తమ గురించి గొప్పగా చెప్పుకొనే వేదికగా చాలామంది సోషల్మీడియాను చూస్తున్నారు. శారీరక అందం గురించి తీవ్రంగా ఆలోచించటం, హీరోహీరోయిన్లలాగా ఉండాలనుకోవటం, అలా లేకపోతే బాధపడటం యువతలో ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నది. సోషల్ మీడియా వేదికల్లో అల్గారిథమ్స్ వినియోగం కారణంగా ఒక వ్యక్తి ఇష్టపడే రంగాలకు సంబంధించిన అంశాలనే మళ్లీమళ్లీ చూపిస్తూ ఉండటంతో ఈ సమస్య మరింత క్లిష్టంగా మారుతోంది. ఫిట్నెస్ పోస్టులను చూసి కండలు పెంచాలనే లక్ష్యంతో విపరీతంగా తినటం, నియంత్రణ లేకుండా వ్యాయామం చేయటం వంటి సమస్యల బారిన పడుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఫొటోలను చూసి, ఇతరులతో పోల్చుకోవటం పెరుగుతున్నది. ముఖ్యంగా మహిళలు, యువతుల్లో ఇది ఒక సమస్యగా పరిణమిస్తున్నది. టైమ్స్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. తాము అందంగా లేమని భావించే టీనేజీ అమ్మాయిల్లో 32 శాతం మంది ఇన్స్టాగ్రామ్ కారణంగా మరింత న్యూనతకు గురయ్యామని చెప్పారు.
ఫొటోలు పోస్ట్ చేసేటప్పుడు తాము అందంగా కనిపించే ఫొటోలే పెట్టాలనే ఒత్తిడి తమపై పని చేస్తున్నదని ఫేస్బుక్ వినియోగదారుల్లో 43 శాతం మంది భావిస్తున్నారని ఫేస్బుక్ జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. టీనేజీ అమ్మాయిల్లోనైతే ప్రతి ముగ్గురిలో ఒకరు అందం గురించి తీవ్రంగా మథనపడుతున్నారట.
ఇదంతా చెప్పటం ఉద్దేశ్యం.. సోషల్ మీడియా అంతా చెడ్డదని కాదు. సోషల్ మీడియా వినియోగంతో మంచిమార్పులు వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, కరోనా సెకండ్వేవ్తో యావత్దేశం అతలాకుతలమైనప్పుడు అనేకమంది యువతీ యువకులు సోషల్మీడియాలో గ్రూపులుగా ఏర్పడి అమూల్యమైన సేవలు అందించారు. రోగులకు ఏ దవాఖానల్లో చికిత్స లభిస్తుంది? హాస్పిటల్ బెడ్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి? కరోనా సోకినవారికి ఆహారం అందించే స్వచ్ఛందసంస్థలు మొదలైన విలువైన సమాచారాన్ని ప్రజలకు అందజేశారు. దీనిద్వారా అర్థమవుతున్నది ఏమిటి?.. ఏ వస్తువైనా, ఉపకరణమైనా దాన్ని మనం ఎలా వాడుకుంటాం అన్నదాన్ని బట్టే దాని వల్ల మంచిగానీ, చెడుగానీ జరుగుతుంది.
సోషల్ మీడియా వినియోగంపై ముఖ్యంగా టీనేజీ దశకు కూడా చేరుకోని పిల్లల్లో దాని వినియోగంపై నియంత్రణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సోషల్మీడియా వల్ల తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కొనేలా ఈ ప్రయత్నం జరుగాలి. మానసిక ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావాన్ని సీరియస్గా తీసుకోవాలి. డిప్రెషన్, యాైంగ్జెటీ వంటి మానసిక సమస్యల కేసులు ఏ స్థాయిలో నమోదవుతున్నాయో రికార్డు చేయాలి. వాటికి కారణాలను గుర్తించాలి. కుల, మత, ప్రాంత, లింగ, వర్గ తదితర సామాజిక అంశాల నేపథ్యాన్ని కూడా తీసుకొని ఈ అధ్యయనం జరుపాలి. దేశంలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవటానికి అవసరమైన విధానపరమైన, చికిత్సపరమైన పరిష్కారాలు ఈ విధమైన సమగ్ర పరిశోధన వల్లనే లభిస్తాయి. ఈ కసరత్తులో మొట్టమొదట చేయాల్సిన పని.. ఈ సమస్యపై అవగాహనను పెంచటం. ఈ సమస్యను చెప్పుకోవాలంటేనే భయపడే, మొహమాటపడే పరిస్థితి లేకుండా స్వేచ్చాయుత వాతావరణాన్ని కల్పించటం (de-stigmatising the issue). సమస్య నుంచి బయటపడటానికి బాధితులకు కుటుంబసభ్యులు, స్నేహితులు అండగా నిలబడేలా వారిలో ైస్థెర్యాన్ని, అవగాహనను పెంపొందించాలి. అంతేగాక, ఇటువంటి వ్యవస్థీకృత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే.. విద్యారంగంలో, పని ప్రదేశాల్లో తీసుకురావాల్సిన మార్పుల గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది.
-డాక్టర్ సుకృతి చౌహాన్, షిరీన్ యాచు ఈటీఐ సర్వీసెస్ ( ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో…)