ఆధునిక ప్రపంచంలో ఏదేని ఒక దేశం గానీ, రాష్ట్రం గానీ వ్యవసాయ, పారిశ్రామిక, శాస్త్ర సాంకేతికరంగాల్లో అభివృద్ధిని ఒంటరిగా సాధించలేవు. దేశీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు, సాంకేతిక సహకారం ఈ రంగాల్లోకి రావటం అనేది అనేక ప్రాతిపదికల మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ సానుకూల అనుమతి విధానాలు, ప్రకృతి, మానవ వనరుల లభ్యతలు కీలకపాత్ర వహిస్తాయి. ప్రధానంగా ప్రజారోగ్యం, వైద్య చికిత్స సదుపాయాలున్న ప్రాంతాల్లో పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపిస్తాయి. మానవ వనరులున్న చోట తమ సంస్థల పురోగతి ఉంటుందని ఆ సంస్థలు భావిస్తాయి.
2014 నుంచి ఏటా వార్షిక ఆరోగ్య సూచిలో తెలంగాణ రాష్ట్రం తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వెళ్తున్నది. 2021లో దేశంలో 3వ స్థానాన్ని పొందింది. కేసీఆర్ స్వప్నమైన ‘ఆరోగ్య తెలంగాణ’ పరిపూర్ణత వైపుగా ప్రస్థానం కొనసాగడం వల్లనే ఇది సాధ్యమైంది. ప్రపంచ వాక్సిన్ అవసరాల్లో 33 శాతం అందించడంతో పాటు, దేశీయ ఫార్మా రంగానికి చెందిన 40 శాతం ఉత్పత్తులకు తెలంగాణ కేంద్రంగా నిలిచింది.
కేసీఆర్ తన ప్రథమ ప్రాధాన్యంగా ఉన్న వ్యవసాయరంగాన్ని ఉత్కృష్ట స్థాయికి తీసుకవచ్చి రైతుల జీవన ప్రమాణాలు పెంచారు. తద్వారా కొనుగోలు శక్తి, వినిమయ సామర్థ్యాలు పెరిగాయి. ఇదే క్రమంలో కేసీఆర్ తెలంగాణ వైద్యారోగ్య వ్యవస్థపై ప్రత్యేక దృష్టిపెట్టారు. తద్వారా అనూహ్యమైన వికాసాన్ని అనతికాలంలో సాధించారు. వైద్యం వ్యాపార వస్తువుగా మారిన కాలంలో ప్రజలు తమ కష్టార్జితంలో ఎక్కువ శాతం ఆరోగ్య రక్షణకే వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య సేవలకు, దవాఖానల ఏర్పాటు మౌలిక సౌకర్యాల కల్పన, వైద్య, విద్య మొదలైన రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సంకల్పంతో శీఘ్ర గతిలో వికాసం సాధించింది.
2030 నాటికి ప్రసూతి, శిశు మరణాల రేటును, నీటి జనిత, మహమ్మారి వ్యాధుల వల్ల కలిగే మరణాలకు ముగింపు పలకడం వంటి లక్ష్యాలను ఐరాస నిర్దేశించింది. దీనికిగాను ఉదాత్తంగా సేవలందించే వైద్య నిపుణుల అవసరం ఉన్నది. డబ్బుల ద్వారా వైద్య విద్యను పొందినవారు వృత్తిని సేవగా కాకుండా సంపాదనకు ప్రాధాన్యం ఇచ్చే అమానవీయ ధోరణులు పెరుగుతున్నాయి. విద్యా రుణాలు ఆర్థికాభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని కుంటుపరుస్తాయి. దీన్ని నివారించటానికి కేసీఆర్ ప్రభుత్వరంగంలో ఇప్పటికే 17 నూతన వైద్య కళాశాలలు ప్రారంభించారు. రాష్ట్రసాధన నాటికి కేవలం 3 వైద్య కళాశాలలే ఉన్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక వైద్యకళాశాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం కదులుతున్నది. 2014లో 2800గా ఉన్న మెడికల్ సీట్ల సంఖ్య, ఇప్పుడు 6500కు చేరింది. త్వరలో పదివేలకు చేరనున్నది.
నిమ్స్, ఎయిమ్స్లతో పాటు గచ్చిబౌలిలో రిమ్స్ను అభివృద్ధి పరిచింది ప్రభుత్వం. 2వ రాజధానిగా భావిస్తున్న సాంస్కృతిక నగరంగా ఉన్న వరంగల్లో రెండువేల పడకల సామర్థ్యం ఉన్న 24 అంతస్తుల దవాఖానను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇప్పటికే 21 జిల్లా దవాఖానలతో పాటు 8 వేలకు పైగా ఉన్న గ్రామీణ, పట్టణ, బస్తీ, ప్రాథమిక ఆరోగ్య, ప్రసూతి కేంద్రాలు తెలంగాణ ప్రజల ఆరోగ్య రక్షణ చికిత్సలో నిమగ్నమై ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఐదుగా ఉన్న డయాలిసిస్ సెంటర్లను ఇపుడు 145కి పెంచారు. ప్రభుత్వ వైద్యశాలల్లో 1,326 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతున్నది. కొత్త వైద్య కళాశాలల్లో 1,183 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 357 ట్యూటర్ పోస్టుల నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. గ్రామీణ తెలంగాణలో పనిచేస్తున్న 27 వేల మంది ఆశా వర్కర్లు ప్రభుత్వ వైద్యసేవలను ఆరోగ్య పథకాలను ప్రజలకు అందించడంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వైద్యసేవలు పొందే రోగుల శాతం ఏటా పెరుగుతున్నదని అనేక సర్వేలు చూపిస్తున్నాయి.
కేంద్రం కొత్తగా మంజూరు చేసిన వైద్య కళాశాలల్లో ఒక్కటి కూడా తెలంగాణకు మంజూరు చేయలేదు. అందరికీ అందుబాటులో తక్కువ వ్యయంతో నాణ్యమైన వైద్యం అందిస్తానని చేసిన వాగ్దానం కేంద్రం నిలుపుకోలేకపోయింది. ప్రజారోగ్య విధానాల అమలుకు కనీస సహాయాన్నివ్వడం లేదు. బీజేపీ విధానాలు ఇలానే కొనసాగితే ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ‘అందరికీ ఆరోగ్యం-2030 లక్ష్యం’ మరింత ఆలస్యమవుతుంది.
ప్రపంచంలో అనేక దేశాలు జనాభా, వైద్యు ల నిష్పత్తి మెరుగు పర్చటానికి, ప్రజారోగ్య విధానాలకు ప్రాధాన్యం ఇచ్చి మెరుగైన ఆరోగ్య సూచికలను నమోదు చేసుకున్నాయి. సురక్షిత తాగునీరును అందివ్వడం, శానిటేషన్, వ్యర్థాల నిర్వహణతో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుకుంటున్నాయి. ఆహారభద్రత, స్త్రీ విద్య, మెరుగైన జీవన పరిస్థితుల కల్పనతో ఆరోగ్య సమాజాన్ని కొనసాగిస్తున్నాయి. ఇదే తాత్త్వికతను కేసీఆర్ అమలుచేసి దేశానికి దిక్సూచిగా నిలిచారు. మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షిత తాగు నీరును పట్టణాలు, గ్రామాల్లో అందించి నీటిజనిత వ్యాధులు ప్రబలకుండా అద్భుత ప్రగతిని సాధించారు.
అలాగే హరితహారం, ప్రకృతి వనాలు, గ్రామీణ పట్టణ శానిటేషన్లో తెలంగాణ నమూనాగా పనిచేస్తున్నదని పరిశుభ్రమైన గాలి వల్ల వాయుజనిత వ్యాధులు తగ్గాయని అనేక సర్వేలు తెలియచేశాయి. దీనికి నిదర్శనంగా పెద్ద రాష్ర్టాల కేటగిరిలో 13 ‘స్వచ్ఛ భారత్’, ‘మిషన్ 2022’ పురస్కారాలను తెలంగాణ కైవసం చేసుకొని ప్రథమ స్థానం పొందింది. కేంద్రం కొత్తగా మంజూరు చేసిన వైద్య కళాశాలల్లో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. అందరికీ అందుబాటులో తక్కువ వ్యయంతో నాణ్యమైన వైద్యం అందిస్తానని చేసిన వాగ్దానం కేంద్రం నిలుపుకోలేకపోయింది. ప్రజారోగ్య విధానాల అమలుకు కనీస సహాయాన్నివ్వడం లేదు. బీజేపీ విధానాలు ఇలా నే కొనసాగితే ఐక్యరాజ్యస మితి నిర్దేశించిన ‘అందరికీ ఆరోగ్యం-2030 లక్ష్యం’ మరింత ఆలస్యమవుతుంది.
(వ్యాసకర్త: ఉపాధ్యక్షులు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం)
అస్నాల శ్రీనివాస్
96522 75560