ఎక్కడ పుట్టినాడ,మరి నెక్కడ నిల్చితిదెందు జీవికన్ దక్కుచునుంటి, నెక్కడ బుధస్తవనీయ మనోజ్ఞమందిరం బొక్కడ పూనుకొంటి! కవితోద్యమవృత్తి యశస్సు పొందలే దెక్కడ? నీదయామహిమయే జగదీశ్వరి, వాసదీశ్వరీ!
అష్టావధాన వేదికలే దేవీ ఆలయ నిర్మాణ ప్రచార వాహికలుగా దశాబ్దాల పాటు పరిశ్రమించి, అనంతసాగర్ కొండల్లో సరస్వతీదేవిని నెలకొల్పిన సిద్ధ సంకల్పులు అష్టకాల నరసింహరామశర్మ. సరస్వతీ తత్వాన్ని ప్రచారం చేయడమే జీవన లక్ష్యంగా స్వీకరించి, కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు సరస్వతీయజ్ఞాలు నిర్వహించిన మహనీయమూర్తి అష్టకాల ధన్యజీవి.
1980 మే 2న సిద్దిపేట సమీపంలోని అనంతసాగర్ కొండల్లో దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నాటి నుంచి, ఎవరినీ యాచించకుండా నిర్మించాలన్న అమ్మ ఆదేశాన్ని శిరసావహించారు. అష్టకాల అవధాన వేదికల్లో ఆలయ నిర్మాణ అంశాన్ని వివరిస్తూ, అడగకుండా దాతలు ఇచ్చిన విరాళాలతో దశల వారీగా సాగిపోయారు. వృత్తి రీత్యా తెలుగు అధ్యాపకుడిగా పాఠశాలల్లో అవధానాల నిర్వహిస్తూ, ప్రవృత్తి రీత్యా జ్యోతిష, వాస్తు, భూగర్భ జలార్గళ శాస్ర్తాల నిశిత పరిశీలనతో సాధించిన జ్ఞానాన్ని కోరినవారికి అందించారు. పదహారేండ్ల పసిప్రాయంలో పద్యాలు రాయడం ప్రారంభించి, రెండు పదుల వయస్సు దాటకముందే మూడు కావ్యాలు రాసిన ఘనత అష్టకాలది. అవధాన విద్యను ఆకళింపు చేసుకుని సుమారు రెండు వందల అవధానాలతో జైత్రయాత్ర నిర్వహించారు.
‘గుడిగట్టందొరకొంటి యేదొరను నే యాచింగ బోలేదు’ అని నిర్భయంగా, నిర్మోహమాటంగా వివరించిన అష్టకాల, ‘నీ పని ముగియించుకొందువో అపప్రధ నాకు ననుగ్రహింతువో’ అంటూ దీనంగా సరస్వతీ మాతను వేడుకున్నారు. సరస్వతీ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా అయిదువందల వరకు సరస్వతీయజ్ఞాలు నిర్వహించారు. సాత్వికాహారం తోనే తనసాధన సాగిపోతుందనే విశ్వాసంతో నలభై సంవత్సరాలుగా పండ్లు, పాలు మాత్రమే ఆహారంగా ఆయన స్వీకరిస్తున్నారు. మరికొన్ని క్షణాల్లో పార్థివదేహాన్ని వీడే వరకు ఆరోగ్యంగా తిరుగాడుతూ, అనాయాసంగా కన్ను మూశారు. సంస్కృతం, తెలుగు భాషల్లో అనేక రచనలు ఆయన సాహితీ మూర్తి మత్వానికి కరదీపికలు.
-శరదిందు