దేశంలోని ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులన్నీ రాజ్యాంగ రక్షణను ఒక కర్తవ్యంగా భావిస్తున్నాయి. దేశ పురోగతికి రాజ్యాంగం అవసరమే తప్ప ఆటంకం కాదని గుర్తించాయి. రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురాగలిగితే తాము కోరే ప్రజాతంత్ర విప్లవ దశను పూర్తిచేయవచ్చని ఇప్పుడు అన్ని వామపక్షాలు గుర్తిస్తున్నాయి.
పశుమాంస భక్షణపై నిషేధం, నైతిక పోలీసింగ్, కళాకారులను, సాంస్కృతిక ఉత్పత్తులను హిందూ వ్యతిరేకమైనవని తెగనాడటం, ఉన్నత విద్యాసంస్థలపై దాడులు చేయడం, హిందూత్వ విలువలకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేయడం, కళలను సెన్సార్షిప్కు గురిచేయడం, కళాకారులను బెదిరించడం ఇవన్నీ కూడా నియంతృత్వ దాడులే. రామ జన్మభూమి, ఆవు లాంటి చిహ్నాలను మతపరమైన సమీకరణ కోసం సంఘ్ పరివార్ వినియోగించుకుంటున్నది.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ.. ‘రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ దాన్ని అమలుచేసే పాలకులు మంచివారు కాకపోతే ఆ రాజ్యాంగం చెడ్డదిగా నిరూపించబడుతుంది. నేటి నుంచి మనం వైరుధ్యభరిత జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వం పొందినా, సామాజిక, ఆర్థిక హక్కుల విషయంలో సమానత్వం రాలేదు. ఈ వైరుధ్యాన్ని ఎంతకాలం కొనసాగించాలి. సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని ఎంతకాలం తిరస్కరించాలి. మనం ఎంతకాలం తిరస్కరిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యం అంత ప్రమాదంలో పడిపోతుంది. అందువల్ల ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. లేకుంటే అసమానతలతో బాధపడేవారు ఈ రాజ్యాంగ అసెంబ్లీ చాలా శ్రమతో నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని కూల్చేస్తారని’ హెచ్చరించారు. ఆయన హెచ్చరికలు నేడు వాస్తవరూపం ధరించాయనే అవగాహన అభ్యుదయ శక్తులన్నిటికి వచ్చి ఏకీభవించాయి.
ముంచుకొస్తున్న ప్రమాదం: మోదీ నాయకత్వంలోని కేంద్రం నేడు రాజ్యాంగ మౌలిక సూత్రాలపైన దాడిని తీవ్రతరం చేస్తున్నది. నిజానికి రాజ్యాంగం రూపుదిద్దుకుంటున్న నాటినుంచి దానిపై హిందూత్వ శక్తులు దాడి ప్రారంభించాయి. ఎందుకంటే హిందూ రాజ్యస్థాపనకు రాజ్యాంగమే అడ్డంకి కాబట్టి. మన రాజ్యాంగం పాశ్చాత్య దేశాల రాజ్యాంగాల నుంచి వివిధ అధికరణలను అరువుగా తెచ్చి భారీగా జాతులు కలెగూర గంపగా రూపొందించబడినదని, ఇందులో మనది అని చెప్పుకోవడానికి ఏమీ లేదని ప్రకటిస్తున్నాయి. ఇలా కాషాయ దళాలు అవకాశం దొరికినప్పుడల్లా మన రాజ్యాంగంపై దాడి చేస్తూనే ఉన్నాయి.
ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య, విద్యుత్ వంటి రంగాల్లో నిరంకుశంగా చొరబడి చేస్తున్న చట్టాలు రాష్ర్టాల హక్కులను కాలరాస్తూ భారత రాజ్యాంగం ఫెడరల్ స్వభావాన్ని అంతం చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతున్నది. స్వాతంత్రోద్యమం ముందుకు తెచ్చిన లౌకికతత్వం, ఫెడరలిజం, సామాజిక న్యాయం వంటి ఉన్నత విలువలకు చెల్లుచీటీ ఇచ్చి రాజ్యాంగాన్ని హిందుత్వం ఆధారంగా నడిపించే దేశంగా మార్చనున్నారు. 1998లో బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు రాజ్యాంగాన్ని సమీక్షించడానికి వెంకట్రామయ్య కమిషన్ను నియమించింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ పీఠికలో ఉన్న లౌకిక, సోషలిస్ట్ అనే పదాలు లేకుండా 2015 రిపబ్లిక్ డే నాడు ప్రభుత్వ వాణిజ్య ప్రకటన వెలువడింది. 2019లో మోదీ రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు రాజ్యాంగంపై మరింత తీవ్రమైన దాడి జరుగుతున్నది. రాబోయేరోజుల్లో బీజేపీ ప్రభుత్వం మత స్వేచ్ఛకు సంబంధించిన అధికరణ 25, మైనారిటీలకు విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకోవడం గురించి ఉన్న అధికరణం 30 లాంటి ముఖ్యమైన వాటిని కూడా సవరించి రద్దు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. దేశానికి అధ్యక్ష తరహా పాలన కావాలనే తన భావనను ముందుకుతీసుకొచ్చి ఇప్పుడు ఏక సమయంలో పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలనే తన ప్రతిపాదనకు మద్దతు సమీకరించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇకపోతే న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, సీబీఐ, ఈడీ, ఆర్బీఐ మొదలైన రాజ్యాంగ అధికార వ్యవస్థలు కూడా హిందుత్వ ఎజెండాకు అనుగుణంగా వ్యవహరించాలన్న ఒత్తిడికి గురవుతున్నాయి. సంఘ్పరివార్ మెజారిటీవాదాన్నే ప్రజాస్వామ్యంగా పరిగణిస్తుంది. నాయకుడి ప్రాతిపదికన నియంతృత్వ ప్రభుత్వం ఉండాలని అది కోరుకుంటుంది. బీజేపీ విధానాలను ఏ మాత్రం విమర్శించినా వారిని జాతి వ్యతిరేకులుగా, పాకిస్తాన్, చైనా అనుకూల శక్తులుగాను ముద్రవేస్తున్నారు. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసే వారిపై రాజద్రోహ నేరాన్ని మోపడం ఇప్పుడు సాధారణమైపోయింది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోను, ఢిల్లీలోని విశ్వవిద్యాలయ విద్యార్థులపైన, సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేసిన వారిపై అణచివేత చర్యలు బీజేపీ నిరంకుశ, ప్రజాతంత్ర వ్యతిరేక స్వభావాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఒక్క రాజకీయ రంగంలోనే కాకుండా సామాజిక, సాంస్కృతిక రంగాలలో కూడా నియంతృత్వానికి రంగం సిద్ధం చేస్తున్నది.
బీజేపీ సమాజంలోని పేద ప్రజానీకంలో మూఢత్వాన్ని పెంచి మత ఘర్షణలను సృష్టిస్తుంది. ఇంత బహిరంగ పక్షపాతాన్నీ, మతతత్వ ప్రభుత్వాలను ఈ 75 ఏండ్ల స్వతంత్ర భారతం గతంలో ఎప్పుడూ చూడలేదు. భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు ఇవన్నీ భిన్నం. అందుకే ఒక పథకం ప్రకారం రాజ్యాంగాన్ని నిర్వీర్యపర్చి హిందూత్వ రాజ్యాంగం తీసుకురావడానికి పెద్ద కుట్ర జరుగుతున్నది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ చెప్పే ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అన్న నినాదమే పచ్చి అబద్ధం. కాబట్టి ప్రగతిశీల, ప్రజాస్వామిక శక్తులన్నీ ఈ కుట్రలను తిప్పికొట్టాలి. ప్రజాస్వా మ్యం, ఫెడరలిజం, లౌకికతత్వం సామాజికన్యాయం, భిన్నత్వంలో ఏకత్వం వంటి రాజ్యాం గ విలువలను కాపాడుకోవాలి.
-నాదెండ్ల శ్రీనివాస్
96764 07140