మహాకవి అని శేషేంద్రశర్మ నుంచి ప్రశంసలందుకున్నా ఆయన చాలామందికి తెలియదు. ప్రముఖ సాహితీవేత్త దుగ్గిరాల రామారావు ఈయన పద్యకవితాధార గంగా ప్రవాహమని ప్రస్తుతించారు. ఆయనే జీవీ సుబ్బారావు. తన సాహితీ ప్రతిభ గురించి, తన పద్యకవితా ప్రాశస్త్యం గురించి ఆయనెన్నడూ ప్రచారం చేసుకోలేదు.
కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడు గుఱ్ఱప్పడి వేంకట సుబ్బారావు (జీవీ సుబ్బారావు) 92వ ఏట ఈ నెల 24న ఏ విధమైన అనారోగ్యం లేకుండా ప్రశాంతంగా నిద్రలో నుంచి దీర్ఘ నిద్రలోకి వెళ్లిపోయారు. 1929 సెప్టెంబర్ 25న నెల్లూరులో జన్మించిన సుబ్బారావు ఏజీ ఆఫీసులో సీనియర్ ఆడిట్ ఆఫీసర్గా ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్లో స్థిరపడినారు.
వృత్తిరీత్యా ఆడిటింగ్ నిపుణుడైనా ప్రవృత్తి రీత్యా తెలుగు కవి, రచయిత. గణితశాస్త్రం, ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు సాధించి మద్రాస్ యూనివర్సిటీలో బంగారు పతకం పొందారు జీవీ సుబ్బారావు. తెలుగు భాషలో ఎంఏతో పని లేకుండానే అపూర్వమైన ‘సీతామనోరామాయణమ్’ అనే మహాకావ్యాన్ని సులభమైన తెలుగు భాషలో 16,819 మధురమైన పద్యాలతో రచించిన తెలుగు భాషావేత్త ఆయన. ‘ఈనాటి పద్యకవుల్లో సుబ్బారావు మహాకవి పీఠాలంకృతుడన్న మాట నిష్కృష్టము. ఆయనకు నా హార్దిక అభినందనలు’ అని గుంటూరు శేషేంద్రశర్మ నుంచి ప్రశంసలందుకున్నారు. ప్రముఖ సాహితీవేత్తలు ఉత్పల సత్యనారాయణాచార్యులు, దుగ్గిరాల రామారావు వీరి కావ్యాలను విశేషంగా ప్రస్తుతించారు.
సుబ్బారావు అంతకుముందు ‘క్రాస్ రోడ్స్’, ‘శిల్పాశ్రువులు’ అనే వచన కవితా సంపుటాలను వెలువరించారు. ‘తారారాఘవం’ నాటికను, ‘వేదనా మధ్యాక్కఱలు’, ‘శ్రమణి’ అనే పద్యకావ్యాలు రచించారు. అమెరికన్ ఆంథాలజీ ఆఫ్ పోయెట్రీ అనే సంస్థ సుబ్బారావు రచించిన కొన్ని వచన కవితలను ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించింది. ‘తారా రాఘవం’, ‘నీలవేణి’, ‘విమోచన’ అనే నాటికలు విజయవాడ, హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమైనాయి.
సీత చెప్పిన రాముని కథకు సుబ్బారావు సృష్టికర్త. రామాయణ కథానాయిక సీత స్వయంగా మనకు రామాయణ కథ వివరిస్తే ఏ విధంగా ఉంటుందో అనే అద్భుతమైన ఊహకు ‘సీతామనో రామాయణం’ పద్యకావ్య స్వరూపం. వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో ఉన్న సీతాదేవి తన కథను పుత్రులైన కుశ లవులకు, వారి గురువుగారైన వాల్మీకికి కూడా వినిపించినట్టు ఈ కావ్యం సాగుతుంది. వాల్మీకి తన రామాయణాన్ని ‘సీతాయాశ్చరితం’ అని పిలుచుకున్నాడు. కనుక ‘సీతామనో రామాయణం’ అనే నామకరణం సహేతుకమే అని ఉత్పల సత్యనారాయణాచార్య బాలకాండ పుస్తకానికి ముందుమాటలో పేర్కొన్నారు. ‘శ్రమణి’ కావ్యాన్ని సుబ్బారావు శబరి కేంద్ర బిందువుగా నిర్మించారు.
ఒక మంచి కవి. ప్రచారానికి పాట్లు పడని నిరాడంబరుడు జీవీ సుబ్బారావు. అనేక మహాకావ్యాలు రచించి మహాకవి అని మహాకవుల చేత పిలిపించుకున్న సాహితీవేత్త.
మాడభూషి శ్రీధర్
84476 51505